ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ రైతులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్?.., క్లారిటీ ఇదే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 09, 2025, 07:55 PM

ఆంధ్రప్రదేశ్‌లో కొద్ది రోజులుగా యూరియా కొరత వెంటాడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరిపి రైతులకు అవసరమైన మేర యూరియాను తెప్పించే పనిలో ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే ఈ యూరియా అంశంపై సీఎం చంద్రబాబు రైతులకు వార్నింగ్ ఇచ్చారంటూ.. జైల్లో పెడతామంటూ ఘాటుగా స్పందించారంటూ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో వైరల్ అవుతోంది. యూరియా విషయంలో చంద్రబాబు రైతుల్ని హెచ్చరించారంటూ ఈ వీడియో చక్కర్లు కొడుతోంది.


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది.. ఈ వీడియోపై క్లారిటీ ఇచ్చింది. 'ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని కూడా తమకు నచ్చినట్లుగా ఎడిటింగ్ చేసి ఆయన ఏపీ రైతులకు వార్నింగ్ ఇచ్చినట్టు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. యూరియా విషయంలో ఫేక్ ప్రచారాలకు దిగి రైతులను ఆందోళనకు గురిచేస్తున్న కొందరు కుట్రదారుల గురించి సీఎం చంద్రబాబు గారు మాట్లాడిన మాటలను ఇలా వక్రీకరించారు. కాబట్టి రైతులు కానీ, ప్రజలు గానీ ఇటువంటి ఫేక్ వీడియోలను నమ్మవద్దు. ఇతరులకు షేర్ చేయవద్దు.. ముఖ్యమంత్రి గారి విషయంలో ఇటువంటి ఫేక్ వీడియోలను తయారుచేసి, ఇతరులకు పంపిస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది' అంటూ హెచ్చరించారు. అయితే సీఎం చంద్రబాబు గత వారం యూరియా అంశంపై సమీక్ష చేసిన సమయంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొందరు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఉద్దేశపూర్వకంగా ఆ వీడియోను ఎడిటింగ్ చేసి ఇలా ప్రచారం చేస్తున్నారని ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.


యూరియా అంశంపై సమీక్ష చేసిన సమయంలో వైఎస్సార్‌సీపీ తీరుపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని.. రైతులకి సకాలంలో యూరియా అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎరువులు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరు ఫేక్ మనుషుల్ని పంపి గొడవలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో రైతుల ముసుగులో కొందరు వైఎస్సార్‌సీపీ వాళ్లు కావాలని ఎరువులు హైజాక్ చేసి గొడవకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇలా గందరగోళం సృష్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తప్పుడు వార్తలు రాస్తే ఖండనలు ఇవ్వడమే పనిగా పెట్టుకోవాలా అన్నారు. ఆ పార్టీ నేతలు గుడ్డ కాల్చి ముఖాన పడేసే పిచ్చి ఆటలు ఆడొద్దని హెచ్చరించారు.


సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్రం రూ.12 వేల కోట్లు ఇస్తుంటే కొందరు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రైతులు యూరియా ఎక్కువగా వాడితే ఆరోగ్యానికి మంచిది కాదని.. పురుగు మందులు, రసాయన ఎరువులు తగ్గించాలని, వాటికి రాయితీలు ఇస్తామన్నారు. కాఫీ పంటకు తెగులు వస్తే రైతులకు పరిహారం ఇచ్చి పంట తీసేయమని చెప్పామన్నారు. రాజకీయాల్లో విలువల్లేని వ్యక్తులు ఉంటే ఇలాంటి సమస్యలు వస్తాయని అన్నారు. ప్రభుత్వం సోషల్ మీడియాలో తప్పుడు వార్తలపై సీరియస్ గా ఉందన్నారు. యూరియా వాడకం తగ్గించాలని..రసాయన ఎరువులకు బదులు ప్రత్యామ్నాయాలు వాడితే మంచిదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa