దేశీయ మార్కెట్లో వెండి ధర దూకుడు మీదుంది. భవిష్యత్తులో ఈ జోరు మరింత పెరిగి కిలో వెండి ధర ఏకంగా రూ.1.5 లక్షల స్థాయికి చేరవచ్చని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా వేసింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్, వాణిజ్యపరమైన ఒత్తిడులు, సరఫరా కొరత వంటి కారణాలు వెండి ధరకు ఊతమిస్తున్నాయని తన తాజా నివేదికలో పేర్కొంది.ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా అనుసరిస్తున్న సుంకాల విధానాల్లోని అనిశ్చితి కారణంగా మదుపరులు బంగారంతో పాటు వెండిని సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావిస్తున్నారు. దీనికి తోడు ఎలక్ట్రానిక్స్, సౌర విద్యుత్ వంటి రంగాల నుంచి పారిశ్రామిక డిమాండ్ అధికంగా ఉండటం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమవుతోంది. 2025లో మొత్తం వెండి ఉత్పత్తిలో దాదాపు 60 శాతం పారిశ్రామిక అవసరాలకే వినియోగించబడుతుందని నివేదిక వెల్లడించింది.ఈ సంవత్సరం ఇప్పటికే వెండి ధర 37 శాతం పెరిగింది. గతంలో రూ.1,11,111, రూ.1,25,000 లక్ష్యాలను చేరుకున్న వెండి, ఇప్పుడు రూ.1,35,000 స్థాయిని అధిగమించి, దీర్ఘకాలంలో రూ.1,50,000 మార్కును తాకే అవకాశం ఉందని ఎంఓఎఫ్ఎస్ఎల్ అంచనా వేసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 88.5గా ఉన్నప్పుడు ఈ అంచనాలు వర్తిస్తాయని తెలిపింది. వెండి ధర రూ.1,04,000 నుంచి రూ.1,08,000 మధ్యకు వచ్చినప్పుడు కొనుగోలు చేయడం మంచిదని, 12 నుంచి 15 నెలల కాలానికి పెట్టుబడి పెట్టవచ్చని సూచించింది.మార్కెట్లో డిమాండ్కు తగినంత సరఫరా లేకపోవడం కూడా ధరల పెరుగుదలకు దోహదం చేస్తోంది. వరుసగా ఐదో సంవత్సరం కూడా వెండి సరఫరాలో కొరత కొనసాగుతోంది. సౌదీ అరేబియా సెంట్రల్ బ్యాంక్, రష్యా వంటి దేశాలు తమ నిల్వల కోసం భారీగా వెండిని కొనుగోలు చేస్తుండటంతో పెట్టుబడుల రూపంలోనూ డిమాండ్ బలంగా ఉంది. అయితే, ఈ సంవత్సరం ఆభరణాల డిమాండ్ 6 శాతం వరకు తగ్గొచ్చని నివేదిక పేర్కొన్నప్పటికీ, పారిశ్రామిక, పెట్టుబడి డిమాండ్ బలంగా ఉండటంతో ధరల పెరుగుదల కొనసాగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa