టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షాకు ముంబైలోని సెషన్స్ కోర్టులో చుక్కెదురైంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సప్నా గిల్ తనపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో, కోర్టు ఆదేశించినప్పటికీ కౌంటర్ దాఖలు చేయడంలో విఫలమైనందుకు షాకు రూ. 100 జరిమానా విధిస్తూ మంగళవారం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసలేం జరిగిందంటే..సప్నా గిల్ దాఖలు చేసిన పిటిషన్పై స్పందించాలని సెషన్స్ కోర్టు పృథ్వీ షాను పలుమార్లు ఆదేశించింది. గత విచారణ సమయంలోనే ఇది చివరి అవకాశమని హెచ్చరించింది. అయినప్పటికీ మంగళవారం నాటి విచారణలో కూడా షా తరఫున ఎలాంటి సమాధానం దాఖలు కాలేదు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, "మరో చివరి అవకాశం ఇస్తున్నాం. కానీ రూ. 100 జరిమానా చెల్లించాలి" అని పేర్కొంటూ తదుపరి విచారణను డిసెంబర్ 16వ తేదీకి వాయిదా వేశారు. పృథ్వీ షా ఉద్దేశపూర్వకంగానే న్యాయ ప్రక్రియను తప్పించుకుంటున్నారని సప్నా గిల్ తరఫు న్యాయవాది అలీ కాషిఫ్ ఖాన్ కోర్టులో వాదించారు. "పలుమార్లు సమన్లు జారీ చేసినా, కేసు విచారణలో ఆయన ఇలాగే వ్యవహరిస్తున్నారు" అని ఆయన ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa