ఈ మధ్య కాలంలో అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు జనావాసాల్లోకి ప్రవేశించడం సర్వ సాధారణం అపోయింది. కోతులు, కొండెంగలు వంటి వాటితో పాటు పులువు, అడవి పందులు వంటివి కూడా గ్రామాల్లో తిరుగుతూ.. ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏనుగులు, ఇతర జంతువులు సైతం పొలాల్లో సంచరిస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇలాంటి ఒక సంఘటనే కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది.
ముఖ్యంగా అక్కడి గ్రామాల్లోకి నిత్యం ఓ పులి వస్తూ.. ప్రజలను భయపెడుతోంది. పులి వస్తుండడంతో గ్రామస్థులు ఇళ్లలోంచి బయటకు కూడా రావట్లేదు. ఈక్రమంలోనే ఎలాగైనా సరే పులిని పట్టుకోవాలని అటవీశాఖ అధికారులకు సూచించగా.. గ్రామంలో ఓ బోను పెట్టి వెళ్లిపోయారు. రోజులు గడుస్తున్నా అందులో పులి చిక్కకపోవడం.. గ్రామంలో తరచుగా తచ్చాడడంతో పులికి ఎరగా 10 మంది అటవీశాఖ అధికారులనే వేశారా గ్రామస్థులు. ఏకంగా వారిని బోనులోనే బంధించి చుక్కలు చూపించారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కర్ణాటకలోని చామరాజనగర జిల్లా బొమ్మలాపుర గ్రామంలో తరచూ ఒక పులి సంచరిస్తోంది. పులి భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. తమ రోజువారీ పనులైన పొలం పనులు, కూలి పనులకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు అనేక సార్లు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్థుల ఫిర్యాదుల మేరకు అధికారులు గ్రామం శివార్లలో పులిని పట్టుకోవడానికి బోను ఏర్పాటు చేశారు.
అయితే ఆ బోనులో పులి పడకపోగా.. అది మాత్రం అప్పుడప్పుడు గ్రామంలోకి వచ్చి వెళ్తుండటంతో గ్రామస్థులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అటవీ సిబ్బంది సమస్యను పరిష్కరించడంలో విఫలం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పులి కోసం ఏర్పాటు చేసిన బోనులోనే 10 మంది అటవీ సిబ్బందిని ఎరగా బంధించి, అక్కడే ధర్నాకు దిగారు. తమను బోనులోంచి బయటకు తీసుకు రావాలంటూ అటవీశాఖ అధికారులు కోరినా వినకుండా గంటల పాటు అలాగే ఉంచారు. ముఖ్యంగా ఈ విషయం పైఅధికారుల వరకూ వెళ్లగా వారు రంగంలోకి దిగారు. పులిని త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు. సిబ్బందిని వదిలేయమని కోరారు.
కానీ గ్రామస్థులు మాత్రం వినలేదు. పులిని పట్టుకునే వరకు వారిని బోనులోనే ఉంచుతామంటూ పేర్కొన్నారు. కానీ పులి అక్కడకు వస్తే వారి ప్రాణాలకే ప్రమాదం అని అధికారులు వివరించగా.. గ్రామస్థులు వెనక్కి తగ్గారు. సిబ్బందిని బోనులోంచి వదిలి పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అటవీశాఖ సిబ్బంది బోనులో ఉన్న ఫొటోలు అయితే నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa