తీవ్ర రాజకీయ సంక్షోభం, హింసాత్మక ఘర్షణలతో అట్టుడుకుతున్న నేపాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కీ అంగీకారం తెలిపారు. భారత టీవీ ఛానెల్ సీఎన్ఎన్ న్యూస్18తో మాట్లాడుతూ తాను ఈ ప్రతిపాదనను ఆమోదించినట్లు ఆమె స్వయంగా ధ్రువీకరించారు. తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి నాయకత్వంపై ఆందోళనకారులతో చర్చలు జరగగా, వారు అంగీకరించారు.దేశంలో 'జెన్ జెడ్' బృందం నేతృత్వంలో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారడంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా చెలరేగిన ఈ అల్లర్లలో ముగ్గురు పోలీసులు సహా కనీసం 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. రెండు రోజుల క్రితం పార్లమెంటు భవనం ఎదుట భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 19 మంది యువకులు మరణించారు.నిరసనకారులు అధ్యక్షుడు రామ్చంద్ర పౌడెల్ సహా పలువురు అగ్ర రాజకీయ నాయకుల ఇళ్లపై దాడులు చేసి, పార్లమెంటు భవనాన్ని ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో నేపాల్ సైన్యం రంగంలోకి దిగింది. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.కాగా, హింసాత్మక ఘటనల కారణంగా 24 గంటల పాటు మూతపడిన ఖాట్మండు విమానాశ్రయాన్ని తిరిగి తెరిచారు. సుశీల కర్కీ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా దేశంలో నెలకొన్న అనిశ్చితికి తెరపడుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa