ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్‌తో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: ప్రధాని మోదీ

national |  Suryaa Desk  | Published : Wed, Sep 10, 2025, 08:45 PM

భారత్-అమెరికాల మధ్య టారిఫ్ కొనసాగుతున్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ షాకింగ్ కామెంట్లు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడడానికి తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ట్రంప్ భారత్-అమెరికా వాణిజ్య చర్చలపై చేసిన సానుకూల ప్రకటనకు ఈరకంగా స్పందించారు. ఇరుదేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న చర్చలు.. ద్వైపాక్షిక భాగస్వామ్యం యొక్క అపారమైన సామర్థ్యాన్ని వెలికితీయడానికి మార్గం సుగమం చేస్తాయని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.


ట్రంప్ అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కొంత ఒడిదుడుకులకు లోనయ్యాయి. ముఖ్యంగా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తూ.. ఉక్రెయిన్‌తో యుద్ధానికి రష్యాకు నిధులు చేకూరుస్తుందని ఆరోపిస్తూ అమెరికా 50 శాతం సుంకాలను విధించింది. ఆ తర్వాత నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు కొంతమేర దెబ్బతిన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఇరునేతల మధ్య చోటు చేసుకున్న సానుకూల సంభాషణలు, వాణిజ్య చర్చలు పురోగతిలో ఉన్నాయన్న సంకేతాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా మోదీ.. పుతిన్, జిన్‌పింగ్‌లతో సమావేశం అయినప్పటి నుంచి ట్రంప్‌లో మార్పు వచ్చింది. అప్పటి వరకు భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన తన తీరు మార్చుకున్నారు.


ఈక్రమంలోనే తరచుగా భారత్ తన మిత్ర దేశం అని, ప్రధాని మోదీతో స్నేహం ఎప్పటికీ కొనసాగుతుందంటూ సోషల్ మీడియా వేదికగా వివరిస్తున్నారు. అయితే తాజాగా ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్‌లో ఓ పోస్టు పెట్టారు. అందులో వాణిజ్య చర్చలను విజయవంతంగా ముగించడానికి భారత్-అమెరికా తీవ్రంగా కృషి చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. అలాగే ఈ చర్చల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదని తాను విశ్వసిస్తున్నానని అన్నారు. అంతేకాకుండా రాబోయే వారాల్లో తన క్లోజ్ ఫ్రెండ్ అయిన ప్రధాని మోదీతో మాట్లాడాలని తాను ఎదురు చూస్తున్నట్లు కూడా చెప్పారు.


అయితే ఈ పోస్టుపై ప్రధాని మోదీ సైతం సానుకూలంగా స్పందించారు. అమెరికా-భారతదేశం సన్నిహిత మిత్రులు అని సహజ భాగస్వాములని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇరుదేశాల బృందాలు ఈ వాణిజ్య చర్చలను వీలైనంత త్వరగా ముగించడానికి కృషి చేస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా తాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. రెండు దేశాల ప్రజలకు ఉజ్వలమైన, మరింత సంపన్నమైన భవిష్యత్తును సాధించడానికి మేము కలిసి పనిచేస్తామని మోదీ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లు ఇరుదేశాల సంబంధాలు తిరిగి పటిష్టం అవుతున్నాయని చెప్పకనే చెబుతున్నాయి. చూడాలి మరి మున్ముందు ఏం జరగనుంది అనేది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa