భారత్ మీద ట్రంప్ వైఖరి గంటకో విధంగా మారుతుంది. ఇప్పటి వరకు కూడా మోదీ నా చిరకాల మిత్రుడు.. త్వరలోనే చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గి.. ఇరు దేశాలకు ఆమోదయోగ్యం అయిన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ప్రకటించి... భారత్పై తన వైఖరిని వెల్లడించారు. అదే ట్రంప్ ఇప్పుడు మాత్రం టారిఫ్ల అంశంలో యూటర్న్ తీసుకున్నారు. భారత్ మీద 100 శాతం టారిఫ్లు విధించాలని సూచించారు. ఆ వివరాలు..
భారత్ రష్యా వద్ద చమురు కొనుగోలు చేస్తూ.. ఉక్రెయిన్ మీద యుద్ధానికి పరోక్షంగా సహకరిస్తుందంటూ ఆరోపణలు చేస్తోన్న ట్రంప్.. ఈ అంశంలో భారత్ మీద ఒత్తిడి తెచ్చేందుకు అదనపు సుంకాలు విధించి.. మొత్తం 50 టారిఫ్లు అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోన్న ట్రంప్.. రష్యా మీద మరింత ఒత్తిడి తీసుకువచ్చేందుకు గాను.. కొత్త వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఎన్నారు.
ఈక్రమంలోనే ఇండియా, చైనాతో పాటు ఆయా దేశాల దిగుమతుల మీద 100 శాతం సుంకాలు విధించాలని యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలకు ట్రంప్ సూచనలు చేశారని తెలుస్తోంది. ఫైనాన్షియల్ టైమ్స్ ఈ అంశాన్ని పేర్కొన్నట్లు పలు మీడియా సంస్థలు కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈక్రమంలో మాస్కో మీద ఆంక్షలు విధించే అంశంపై చర్చించేందుకు గాను సీనియర్ అమెరికన్, ఈయూ అధికారులు వాషింగ్టన్లో సమావేశమయినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలో భాగంగా ట్రంప్ కాన్ఫరెన్స్ కాల్లో ఈయూ అధికారులతో మాట్లాడారు. రష్యా మీద ఆర్థికంగా ఒత్తిడి తెచ్చేందుకు గాను భారత్, చైనాలపై 100 శాతం సుంకం విధించాలని ట్రంప్ ఈయూకి సూచించినట్లు తెలుస్తోంది. చమురు కొనుగోలు ఆపుతామనే వరకు ఈ టారిఫ్లను కొనసాగించాలన్నారు. మేం ఇప్పటికే ఇలా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈయై భాగస్వాములతో కలిసి ముందుకు వస్తే.. దీన్ని అమలు చేద్దాం అని అమెరికన్ అధికారి ఒకరు తెలిపారు. అమెరికా సూచనలు అమలుచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈయూ అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది.
యుద్ధానికి ముగింపు పలికి.. ఉక్రెయిన్లో శాంతి స్థాపించాలని.. అమెరికాతో పాటు ఈయూ కూడా భావిస్తుంది. ఈ క్రమంలో రష్యాపై ఒత్తిడి తెస్తేనే అది సాధ్యమవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో యూరోపియన్ నేతలు కూడా ఆ దిశగా ఆలోచన మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. టారిఫ్ల నేపథ్యంలో ఇండియా, అమెరికా మధ్య నెలకొన్ని వాణిజ్య అడ్డంకులు తొలగించేందుకు రెడీగా ఉన్నట్లు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa