టారిఫ్లు పెంచుతూ.. రష్యాతో ఇంధన డీల్ను రద్దు చేసుకోవాలని ఒత్తిడి తెస్తూ.. భారత్ మీద తన అక్కసు వెళ్లగక్కిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హఠాత్తుగా ఉన్నట్లుండి తన స్వరం మార్చారు. నిన్నటి వరకు కూడా భారత్ మీద ఘాటు వ్యాఖ్యలు చేసిన ట్రంప్.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ తన మిత్రుడని.. టారిఫ్ల అంశంలో మరి కొన్ని రోజుల్లోనే మోదీతో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ వేదికగా దీని గురించి ట్రంప్ పోస్ట్ చేశారు. ఆ వివరాలు..
ట్రంప్ ట్రూత్ వేదికగా ఇలా రాసుకొచ్చారు. అమెరికా, ఇండియా మధ్య నెలకొని ఉన్న వాణిజ్య అడ్డంకులను పరిష్కరించేందుకు.. నా పరిపాలన విభాగం.. భారత్తో చర్చలు కొనసాగిస్తుంది. దీనిపై నా మిత్రుడైన భారత ప్రధాన మంత్రి మోదీతో రానున్న రోజుల్లో మాట్లాడేందుకు నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ చర్చలు ఇరు దేశాలకు మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నాను అని పోస్ట్ చేశారు. ట్రంప్ తన తెంపరితనం కట్టిపెట్టి.. ఇంత సౌమ్యంగా.. ఇండియాపై సానుకూలంగా వ్యాఖ్యానించడం కాస్త ఆసక్తికరంగానే ఉంది.
భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ.. అధిక ధరకు విక్రయిస్తూ.. భారీగా లాభాలు ఆర్జిస్తుందంటూ మొన్నటి వరకు కూడా ఇండియా మీద ట్రంప్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ప్రధాని మోదీ.. చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యారు. అక్కడ చైనా, రష్యా దేశాల అధ్యక్షులైన జిన్పింగ్, పుతిన్తో ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు. దీని మీద కూడా ట్రంప్ విమర్శలు చేశారు. చైనా చీకటి వలయంలో భారత్ ఇరుక్కుందంటూ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే.. యూటర్న్ తీసుకున్న ట్రంప్.. భారత్, అమెరికా మధ్య బంధం చాలా ప్రత్యేకమైందని పేర్కొన్నారు. దాని గురించి ఆందోళన చెందళ్సాన పని లేదని తెలిపారు. అలానే ప్రధాని మోదీ కూడా ప్రశంసలు కురిపించారు.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ట్రంప్.. టారిఫ్లతో విరుచుకుపడ్డారు. భారత్ మీద 25 శాతం సుంకాలు విధించారు. దీంతో పాటుగా.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు గాను అదనంగా మరో 25 శాతం సుంకాలు విధించి.. మొత్తం 50 శాతం టారిఫ్లు అమలు చేస్తున్నారు. ఈ అంశంపై భారత్ ఎన్ని సార్లు చర్చలు జరిపినా అగ్రరాజ్యం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం లేదు. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. మరి తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్య చర్చలు సఫలం అయ్యేలా ఉన్నాయంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa