భారత నూతన ఉపరాష్ట్రపతిగా చంద్రాపురం పొన్నుసామి రాధాకృష్ణన్ (సీపీ రాధాకృష్ణన్) ఎన్నిక కావడంతో ఆయన తల్లి జానకీ అమ్మాళ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 62 ఏళ్ల క్రితం తన భర్త సరదాగా అన్న మాటలు ఇప్పుడు నిజమవడం పట్ల ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా తన కుమారుడి పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను ఆమె మీడియాతో పంచుకున్నారు.1957లో తన కొడుకు పుట్టినప్పుడు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశ ఉపరాష్ట్రపతిగా ఉన్నారని జానకీ అమ్మాళ్ గుర్తుచేసుకున్నారు. "ఆయన ఒక ఉపాధ్యాయుడు, నేను కూడా టీచర్నే. ఆయన నుంచి స్ఫూర్తి పొంది నా కొడుక్కి రాధాకృష్ణన్ అని పేరు పెట్టాను. అప్పుడు నా భర్త నన్ను చూసి, 'నీ కొడుకు కూడా ఉపరాష్ట్రపతి అవుతాడని ఆ పేరు పెట్టావా?' అని సరదాగా అన్నారు. ఇన్నేళ్లకు ఆయన మాటే నిజమైంది. చాలా సంతోషంగా ఉంది" అని ఆమె తెలిపారు.సీపీ రాధాకృష్ణన్ సోదరుడు సీపీ కుమారేశ్ కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన సోదరుడు రాజ్యసభ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. "ప్రధాని మోదీ పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన తప్పక నిలబెట్టుకుంటారు. ఈ విజయం మాకెంతో ఆనందాన్నిచ్చింది" అని కుమారేశ్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa