క్రికెట్ ప్రపంచంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దాయాదుల పోరు కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. కానీ, ఈసారి ఆసియా కప్ 2025లో పరిస్థితి భిన్నంగా ఉంది. దుబాయ్ వేదికగా ఎల్లుండి (14న) జరగనున్న ఈ మ్యాచ్ టికెట్లు అమ్మకానికి పెట్టి పది రోజులు దాటినా ఇంకా అందుబాటులోనే ఉన్నాయి. ముఖ్యంగా, ప్రీమియం సీటు ధర సుమారు 4 లక్షల రూపాయలు పలుకుతున్నా వాటిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఆగస్టు 29న అధికారిక భాగస్వామి ప్లాటినమ్లిస్ట్ ద్వారా టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. గురువారం రాత్రి 9 గంటల సమయానికి కూడా స్టేడియంలోని దాదాపు 50 శాతం స్టాండ్లలో టికెట్లు మిగిలే ఉన్నాయి. అందుబాటులో ఉన్న టికెట్ల కనీస ధర 99 డాలర్ల (సుమారు రూ. 8,200) నుంచి మొదలవుతుండగా, ప్రీమియం సీట్ల ధరను 4,534 డాలర్లకు (సుమారు రూ. 4 లక్షలు) నిర్ణయించారు. తక్కువ ధర కలిగిన టికెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి.గతంలో ఇదే వేదికపై 2023 చాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్లు తలపడినప్పుడు కేవలం నాలుగు నిమిషాల్లోనే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. ఆ రికార్డును దృష్టిలో ఉంచుకుని ఈసారి కూడా అదే స్పందన వస్తుందని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) భావించింది. కానీ, అభిమానుల నుంచి ఊహించిన రీతిలో స్పందన రాకపోవడంతో ఈసీబీ అధికారి ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే, మరో అధికారి మాత్రం ‘బుకింగ్స్ ప్రోత్సాహకరంగానే ఉన్నాయి’ అని చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa