బీహార్ ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న వేళ.. కాంగ్రెస్ పార్టీ ఒక సంచలన వీడియోను విడుదల చేసి వివాదాన్ని రాజేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దివంగత తల్లి హీరాబెన్ మోదీని లక్ష్యంగా చేసుకుని.. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో రూపొందించిన ఒక వీడియోను విడుదల చేసింది. అందులో ప్రధాని మోదీ కలలో ఆమె తల్లి కనిపించి.. మోదీ చేస్తున్న రాజకీయాలపై ఆయన్ను మందలిస్తున్నట్లుగా చూపించారు. దీంతో బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ 36 సెకన్ల వీడియోపై "AI GENERATED" అని స్పష్టంగా ఉన్నప్పటికీ.. దీనిని రాజకీయంగా అపహాస్యం చేసేందుకు కాంగ్రెస్ ఉపయోగించిందని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఈ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ ప్రకటించింది.
ప్రధాని మోదీ, ఆయన తల్లి పేరును రాజకీయ వివాదాల్లోకి లాగడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి దారుణమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇటీవలే బీహార్లో కాంగ్రెస్ నిర్వహించిన ఓ ర్యాలీలో.. ఓ వ్యక్తి మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ కాగా.. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సైతం స్పందించి ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పారు. తప్పుడు వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ ఘటన తనను చాలా బాధించిందని ప్రధాని మోదీ కొద్ది రోజుల తర్వాత ఒక కార్యక్రమంలో అన్నారు. "నా దివంగత తల్లికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. అలాంటి ఆమెను దూషిస్తున్నారు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఘటన "ఊహించలేనిది" అని, "దేశంలోని తల్లులు, సోదరీమణులు, కుమార్తెలందరినీ అవమానించడమే" అని పేర్కొన్నారు. దర్భంగాలో జరిగిన ఈ ఘటన తర్వాత బీహార్లోని ఎన్డీఎ మహిళా విభాగం ఐదు గంటల బంద్కు పిలుపునిచ్చింది. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలోని మహిళల గౌరవానికి భంగం కలిగించేవని ఆరోపించింది. అయితే ఇది జరిగి నెల రోజులు కూడా కాకముందే బీహార్ కాంగ్రెస్ మరో షాకింగ్ వీడియోను విడుదల చేసింది.
ముఖ్యంగా ప్రధాని మోదీ పడుకుని ఉన్నట్లు చూపించి.. ఆ తర్వాత ఆయనకు మెలుకువ వచ్చినట్లుగా చూపించారు. అప్పటికే ఆయన తల్లి కూర్చుని ఉండి.. అతడు చేస్తున్న రాజకీయాలపై మోదీని మందలిస్తున్నట్లుగా చూపించారు. మొత్తంగా 36 సెకన్ల నిడివి గల ఈ వీడియో దేశవ్యాప్తంగా చర్చ లేపుతోంది. ఇది చూపిన బీజేపీ నాయకులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఈ వీడియోపై తీవ్రంగా మండిపడ్డారు. "ఈ వీడియోతో కాంగ్రెస్ పార్టీ అన్ని హద్దులు దాటింది" అని ఆయన అన్నారు. "ప్రధాని తల్లిని దూషించినందుకు ఏ మాత్రం పశ్చాత్తాపం చెందకుండా, కాంగ్రెస్ నిందితులను అబద్ధాలతో సమర్థించుకుంటోంది. ఈ పార్టీ గాంధీవాదిగా కాకుండా 'గాలీవాది'గా మారింది" అని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
బీజేపీ ఎంపీ రాధా మోహన్ దాస్ అగర్వాల్ కూడా ఈ చర్యను రాజకీయాల్లో సరికొత్త దిగజారుడుతనంగా అభివర్ణించారు. "దీనికంటే రాజకీయాలు దిగజారలేవు. ప్రధాని మోదీ తన కుటుంబాన్ని రాజకీయాల నుంచి పూర్తిగా వేరుగా ఉంచారు. ఒకవైపు బీహార్ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రధాని తల్లిని దూషిస్తోంది. అది చాలదన్నట్లు డీప్ఫేక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఇలాంటి తప్పుడు వీడియోలను సృష్టించి దేశ ప్రజలను తప్పుదోవ పట్టించి, దేశంలోని తల్లులను అవమానించడానికి ప్రయత్నిస్తున్నారు" అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa