దేశంలో ఇప్పుడు పండగ సీజన్ మొదలు కానుంది. దసరా, దీపావళి వంటి దేశవ్యాప్త పండగలకు రంగం సిద్ధమైంది. అయితే ఏటా చలికాలంలో దేశవ్యాప్తంగా పలు నగరాలు కాలుష్య కోరల్లో చిక్కుకుపోయి.. తీవ్ర అవస్థలు పడుతూ ఉంటాయి. గత కొన్నేళ్లల్లో ఈ కాలుష్యం సమస్య విపరీతంగా పెరిగిపోయి.. అనేక శ్వాసకోశ వ్యాధులకు కారణం అవుతోంది. వృద్ధులు, చిన్న పిల్లలు శీతాకాలం వచ్చిందంటే చాలు.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా తయారవుతోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ మొదటివరుసలో ఉండటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అదే సమయంలో ఢిల్లీతోపాటు భారత్లోని మరిన్ని నగరాలు కూడా ఈ పొల్యుషన్ లిస్ట్లో ఉండటం చర్చనీయాంశంగా మారుతోంది.
కాలుష్య కట్టడికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో మాత్రం ప్రయోజనం కల్పించడం లేదు. ఈ నేపథ్యంలోనే శీతాకాలం వచ్చిందంటే చాలు ఢిల్లీ సహా దేశంలోని కాలుష్యం ఎక్కువగా ఉండే నగరాల్లో భారీగా ఆంక్షలు విధిస్తారు. ఇక మరీ ముఖ్యంగా బాణసంచా కాల్చడంపై నిషేధం విధిస్తారు. దేశ రాజధాని ఢిల్లీ, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో బాణసంచా కాల్చడంపై పూర్తిగా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా సుప్రీంకోర్టు స్పందించింది. బాణసంచాపై కేవలం ఢిల్లీలో మాత్రమే నిషేధం విధిస్తే సరిపోతుందా.. అని ప్రశ్నించింది. ఢిల్లీలో అమలు చేసినట్లు దేశవ్యాప్తంగా బాణసంచాపై ఎందుకు నిషేధం విధించకూడదు అంటూ సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ-ఎన్సీఆర్తో పాటు దేశంలోని ఇతర నగరాల్లోనూ తీవ్ర వాయు కాలుష్యం ఉన్నప్పుడు కేవలం కొన్ని ప్రాంతాల్లోనే బాణసంచాపై నిషేధం ఎందుకు విధించాలని ఈ సందర్భంగా శుక్రవారం సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశంలో పండుగ సీజన్కు ముందు ఈ బాణసంచా అంశంపై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఎన్సీఆర్లో నివసించే ప్రజలకు స్వచ్ఛమైన గాలి పీల్చే హక్కు ఉన్నప్పుడు.. దేశంలోని ఇతర నగరాల్లోని ప్రజలకు ఎందుకు ఉండదని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు.
బాణసంచాపై ఏదైనా విధానం ఉంటే అది దేశవ్యాప్తంగా ఉండాలని.. కేవలం ఢిల్లీ కోసం మాత్రమే ఉండకూడదని వ్యాఖ్యానించారు. గతేడాది తాను అమృత్సర్లో ఉన్నప్పుడు అక్కడ.. ఢిల్లీ కంటే ఎక్కువగా కాలుష్యం ఉందని.. కాబట్టి బాణసంచాపై ఏదైనా నిషేధం విధించాలని ప్రభుత్వం భావిస్తే.. అది దేశవ్యాప్తంగా ఉండాలని సీజేఐ పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే బాణసంచా కంపెనీల తరఫున పలువురు లాయర్లు వాదనలు వినిపించారు. బాణసంచాపై నిషేధం విధించడం కారణంగా ఆ పరిశ్రమపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికుల ఉపాధి దెబ్బతింటోందని వాదించారు. ఈ నేపథ్యంలోనే నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహాయంతో హరిత బాణసంచాను తయారు చేయడానికి బాణసంచా పరిశ్రమ సిద్ధంగా ఉందని కోర్టుకు తెలిపారు.
ఇక ఈ బాణసంచాకు సంబంధించి అమికస్ క్యూరీగా ఉన్న అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి మాట్లాడుతూ.. ఇప్పటికే హరిత బాణసంచాపై నేషనల్ ఎన్విరాన్మెంటర్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం చేస్తోందని సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న సీజేఐ బీఆర్ గవాయ్ ధర్మాసనం.. ఈ కేసులో తదుపరి విచారణను సెప్టెంబర్ 22వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఈ విచారణలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa