మణిపూర్ రాష్ట్రంలో ఏ స్థాయిలో జాతి హింస కొనసాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2023 మే నెలలో ప్రారంభమైన ఈ హింస మొన్న మొన్నటి వరకు కొనసాగింది. అయితే ఇన్నేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటి వరకు ఆ రాష్ట్రానికి వెళ్లలేదు. కానీ నేడు తొలిసారిగా ఆయన మణిపూర్లో పర్యటించారు. అయితే దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. మోదీ పర్యటన కేవలం ఒక "పిట్ స్టాప్" (చిన్న విరామం) మాత్రమేనని.. ఇది రాష్ట్ర ప్రజలకు తీవ్ర అవమానం అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
శనివారం ఉదయం చురాచంద్పూర్, ఇంఫాల్లలో పర్యటించడానికి వచ్చిన మోదీపై ఖర్గే సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. "నరేంద్ర మోదీ గారు.. మణిపూర్లో మీ 3 గంటల పర్యటన కనికరం కాదు. ఇది ఒక ప్రహసనం. కేవలం ప్రదర్శన కోసం మాత్రమే. రిలీఫ్ క్యాంప్లలోని ప్రజల రోదనలు వినకుండా పారిపోవడమే మీ ఉద్దేశ్యం" అని ఆయన పోస్ట్ చేశారు. అక్కడితో ఆగకుండా హింస మొదలైన ఈ 864 రోజుల్లో 300 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. మొత్తంగా 67,000 మంది నిరాశ్రయులు అయ్యారని చెప్పారు. అంతేకాకుండా 1,500 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. ఈ సమయంలో మీరు 46 విదేశీ పర్యటనలు చేశారని.. కానీ సొంత ప్రజలను పరామర్శించడానికి ఒక్కసారి కూడా రాలేదని ఖర్గే అన్నారు.
మీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మణిపూర్లోని అమాయక ప్రజల జీవితాలను బుల్డోజ్ చేసిందంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. అలాగే ప్రధాని, హోం మంత్రి అమిత్ షా అసమర్థత, కుమ్మక్కు కారణంగానే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా ఈ సమస్యను కప్పిపుచ్చుకోవాలని చూశారని ఆరోపించారు. ఈ విషయంలో మీ రాజధర్మం ఎక్కడ కనిపిస్తుందో చెప్పాలంటూ ఖర్గే ప్రశ్నలు సంధించారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ప్రధాని ఇంతకుముందే రాష్ట్రానికి వచ్చి ఉండాల్సిందని అన్నారు. "రెండు సంవత్సరాల తర్వాతనైనా ఆయన మణిపూర్ను సందర్శించడానికి నిర్ణయించుకోవడం సంతోషం. ఆయన చాలా కాలం క్రితమే వెళ్లి ఉండాల్సింది" అని అన్నారు. ప్రధాని మోదీ తన పర్యటనలో నిరాశ్రయులైన ప్రజలతో మాట్లాడారు. అలాగే రూ.8,500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మణిపూర్లో మైతేయ్, కుకి వర్గాల మధ్య భూ హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై మే 2023 నుంచి ఘర్షణలు జరుగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa