ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ అరెస్ట్ పేరుతో,,,రూ.3.72 కోట్లకు సైబర్ నేరగాళ్ల టోకరా

Crime |  Suryaa Desk  | Published : Sat, Sep 13, 2025, 08:40 PM

సైబర్ మోసాల గురించి ప్రభుత్వాలు, సెలబ్రిటీలు ఎన్ని రకాలుగా ప్రచారం చేస్తున్నప్పటికీ.. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా సరే పెద్దగా లాభం లేకుండా పోతుంది. మోసపోయే వాళ్లు ఇంకా మోసపోతూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్లు కూడా జనాలను మోసం చేయడానికి కొత్త కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. అలా ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తోన్న పేరే డిజిటల్ అరెస్ట్. కేటుగాళ్లు విర్చువల్ అరెస్ట్ పేరు చెప్పి సామాన్యుల నుంచి వేలు, లక్షలు, కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారు. తాజాగా ఓ వృద్ధుడు కూడా ఇలానే సైబర్ కేటుగాళ్ల బారిన పడి రూ.3.72 కోట్లు మోసపోయాడు. ఆ వివరాలు..


కేరళలోని కొల్లాం జిల్లాలో ఈ సైబర్ మోసం వెలుగు చూసింది. ఒక వృద్ధుడు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి రూ. 3.72 కోట్లు పోగొట్టుకున్నాడు. వర్చువల్ అరెస్ట్ పేరుతో ఈ మోసం జరిగినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు. వృద్ధుడి ఫిర్యాదు మేరకు కొల్లాం సిటీ సైబర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు..


కులంగర ప్రాంతానికి చెందిన 79 ఏళ్ల వృద్ధుడికి జులై 7న ఒక వాట్సాప్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తాను BSNL అధికారిని అని పరిచయం చేసుకున్నాడు. బాధితుడి మొబైల్ నంబర్‌ను ముంబై సైబర్ పోలీసులు పరిశీలిస్తున్నారని చెప్పాడు. బాధితుడి మొబైల్ నంబర్‌ని.. చట్టవిరుద్ధమైన పనులకు ఉపయోగిస్తున్నారని అనుమానం రావడంతో.. ముంబై పోలీసులు దాన్ని పరిశీలిస్తున్నట్లు భయపెట్టే ప్రయత్నం చేశాడు.


ఆ తర్వాత, పోలీసు దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి వాట్సాప్ వీడియో కాల్‌లో కనిపించాడు. తాను ముంబై సైబర్ పోలీస్ అధికారిని అని పరిచయం చేసుకున్నాడు. బాధితుడి ఆధార్ కార్డు వివరాలను ఉపయోగించి ఒక బ్యాంకు ఖాతాను తెరిచారని, దాని ద్వారా నేరపూరిత కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు బాధితుడిని భయపెట్టారు. అంతటితో ఆగక వృద్ధుడికి ఒక నకిలీ అరెస్ట్ వారెంట్ కూడా చూపించారు. ఆ తర్వాత అతడిని వర్చువల్‌గా అరెస్ట్ చేశామని తెలిపారు.


ఆ తర్వాత, బాధితుడిని వీడియో కాల్ ద్వారా వర్చువల్ కోర్టులో హాజరు కావాలని కోరారు. వర్చువల్ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే, అతను వాట్సాప్ కాల్‌ని ఎప్పుడూ ఆఫ్‌ చేయకుండా, విచారణ అధికారి పర్యవేక్షణలో ఉండాలని షరతు సైబర్ కేటుగాళ్లు షరతు విధించారని బాధితుడు పోలీసులకు చెప్పుకొచ్చాడు. అంటే నిందితులు బాధితుడిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకున్నారన్నమాట.


ఒకవేళ బాధితుడు వారి మాట వినకపోతే, అతని బ్యాంకు ఖాతాలను మూసివేస్తామని, ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని బెదిరించారు. ఆ తర్వాత, బాధితుడు తన బ్యాంకు ఖాతాలను ధృవీకరిస్తే (వెరిఫై చేస్తే) అతడు నిర్దోషిగా విడుదల అవుతాడని సైబర్ కేటుగాళ్లు నమ్మించారు. 'వెరిఫికేషన్' పేరుతో, బాధితుడుతోపాటుగా అతని భార్య ఖాతాల నుండి నిందితులు చెప్పిన ఖాతాలకు డబ్బులు పంపమని కోరారు.


బాధితుడు వారి మాటలు నమ్మి జులై 23 నుండి ఆగస్టు 29 మధ్య 17 లావాదేవీలలో రూ. 3.72 కోట్లు బదిలీ చేశాడు. డబ్బు తిరిగి రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించాడు. దీతో పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొల్లాం సైబర్ పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 318(2), 318(4), 3(5), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 66డీ కింద నిందితుల మీద కేసు నమోదు చేశారు. డబ్బు బదిలీ చేసిన బ్యాంకు ఖాతాలను గుర్తించారు. వాటిని ఫ్రీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని పోలీసులు తెలిపారు. ప్రజలు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa