ఉత్తర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఓ సంచలన తీర్పు వెలువడింది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న కేసులో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర సహాయ మంత్రి ప్రదీప్ జైన్ ఆదిత్యతో పాటు మరో 13 మందికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం శుక్రవారం తీర్పును ఇచ్చింది. ముఖ్యంగా విద్యుత్ కోతల సమస్యపై 2013లో నిర్వహించిన రోడ్డు దిగ్బంధం నిరసనకు సంబంధించిన కేసులో ఈ తీర్పు వచ్చింది. అయితే కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే.. శిక్ష పడిన అందరినీ వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ తీర్పుపై అప్పీల్ చేసుకోవడానికి వారికి నెల రోజుల సమయం కూడా ఇచ్చారు.
అసలేం జరిగిందంటే..?
న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం.. ఈకేసు 2013 జూన్ 11వ తేదీ జరిగిన ఒక నిరసన ప్రదర్శనకు సంబంధించింది. అప్పట్లో విద్యుత్ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పరిచా థర్మల్ పవర్ ప్లాంట్ సమీపంలో ఆందోళన చేపట్టింది. ఈ నిరసనలో భాగంగా మాజీ కేంద్ర సహాయ మంత్రి ప్రదీప్ జైన్ ఆదిత్య పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలు ఝాన్సీ-కాన్పూర్ హైవేను దిగ్బంధం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కిలో మీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ ఘటనపై అప్పటి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్లోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసును విచారించిన అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్, ప్రత్యేక ఎంపీ-ఎమ్పీఎమ్ఎల్ఎ కోర్టు న్యాయమూర్తి అనిల్ కుమార్ సప్తం.. ప్రదీప్ జైన్ ఆదిత్యతో పాటు ఇతరులందరినీ దోషులుగా నిర్ధారించారు. అనంతరం వారికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. కోర్టు తీర్పును సవాలు చేస్తామని, దర్యాప్తులో అనేక అక్రమాలు జరిగాయని ప్రదీప్ జైన్ ఆదిత్య తరపు న్యాయవాది వివేక్ బజ్పాయ్ తెలిపారు. మరోవైపు కోర్టు తీర్పు అనంతరం ప్రదీప్ జైన్ ఆదిత్య భావోద్వేగానికి లోనయ్యారు. తన కార్యకర్తలు కూడా శిక్షకు గురైనందుకు బాధగా ఉందని ఆయన విలేకరులతో అన్నారు. అయినప్పటికీ బుందేల్ఖండ్ ప్రజల సమస్యల కోసం తాను పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. జైలు శిక్ష పడిన తర్వాత కూడా తన ప్రజల కోసం పోరాటం కొనసాగించడం తన నిబద్ధత అని ఆయన అన్నారు.
ఈ కేసులో ప్రదీప్ జైన్ ఆదిత్యతో పాటు శిక్ష పడిన వారిలో రజనీష్ శ్రీవాస్తవ, నవేద్ ఖాన్, రాహుల్ రాయ్, షేర్ ఖాన్, సొహైల్ ఖాన్, సౌరభ్ జైన్, నరేష్ బెల్హతియా, రాహుల్ గుప్తా, షాదాబ్ అహ్మద్, మనోజ్ కుమార్, వీరేంద్ర సింగ్, హరీష్ కపూర్, సల్మాన్ అహ్మద్ ఉన్నారు. వీరందరూ ఇప్పుడు తీర్పుపై అప్పీల్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ కేసులో న్యాయ పోరాటం కొనసాగుతుందని ఆయన తరపున న్యాయవాదులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa