ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గణేష్ నిమజ్జనంలో విషాదం.. 8 మంది భక్తులు మృతి

Crime |  Suryaa Desk  | Published : Sat, Sep 13, 2025, 08:53 PM

వినాయక నిమజ్జనం తీవ్ర విషాదాన్ని నింపింది. గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న భక్తుల మీదకు ఒక ట్రక్కు దూసుకురావడంతో దారుణం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయారు.. మరో 25 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన కర్ణాటక , హాసన్ జిల్లాలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.


కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని జాతీయ రహదారి-373 పై ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి ట్రక్కు అదుపు తప్పింది. అది కాస్త అక్కడే ఉన్న భక్తుల మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు పోలీసులు అదుపులో ఉన్నాడని తెలిపారు.


ప్రమాదం జరిగిన వెంటనే స్పాట్‌లోనే ఐదుగురు చనిపోయారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా..అక్కడ చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. దీంతో ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. ట్రక్కు డ్రైవర్‌ని కూడా ఆస్పత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. అలానే ప్రమాదంలో గాయపడిన 25 మందిలో 18 మందిని హాసన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించారు. మిగిలిన ఏడుగురిని వేర్వేరు ప్రైవేట్ ఆసుపత్రులలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.


ఈ ప్రమాదం గురించి తెలిసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. అలానే ఎక్స్ వేదికగా ఆయన ఒక పోస్ట్ చేశారు. ‘హాసన్‌లో గణేష్ నిమజ్జనానికి వెళ్తున్న ఊరేగింపు మీదకు లారీ దూసుకురావడంతో ప్రమాదం జరిగి.. ఎనిమిది మంది చనిపోయారని తెలిసింది. అలానే 20 మందికి పైగా తీవ్రంగా గాయపడటం బాధాకరం. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని పోస్ట్ చేశారు.


‘ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల పరిహారం అందజేస్తాము. గాయపడిన వారి వైద్యానికి అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఇది చాలా బాధాకరమైన సమయం. ఈ విషాదంలో బాధిత కుటుంబాలకు మనమందరం అండగా నిలుద్దాం’ అంటూ సిద్ధరామయ్య పిలుపునిచ్చారు.


ఈఘటనపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ.. దీన్ని చాలా భయంకరమైన ప్రమాదంగా అభివర్ణించారు. మరణించిన వారికి సంతాపం తెలిపారు. ‘హాసన్ జిల్లాలోని మోసలేహోసల్లిలో గణేశ్ నిమజ్జన ఊరేగింపులో జరిగిన భయంకరమైన ప్రమాదం దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ విషాదకర సంఘటన గురించి వినడానికి నేను చాలా బాధపడుతున్నాను. మృతుల ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు ఈ బాధను భరించే శక్తిని దేవుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను’ అని ఆయన ట్వీట్ చేశారు. సహాయక చర్యలు కొనసాగతున్నాయని.. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని ప్రజలకు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa