ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.30 వేల కోట్లతో కొత్త రైల్వే లైన్లు.. చైనా, మయన్మార్, భూటాన్ సరిహద్దుల వరకు నిర్మాణం

national |  Suryaa Desk  | Published : Sat, Sep 13, 2025, 08:54 PM

ఇటీవల భారత్-చైనా మధ్య మళ్లీ సత్సంబంధాలు మెరుగుపడుతున్నప్పటికీ.. ఈశాన్య ప్రాంతంలో మాత్రం భద్రతను బలోపేతం చేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చైనా, మయన్మార్, భూటాన్ సరిహద్దుల వరకు రైలు మార్గాన్ని విస్తరించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.30 వేల కోట్ల వ్యయంతో 500 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాలను నిర్మించాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్టులో బ్రిడ్జిలు, సొరంగాలు ఏర్పాటు చేయనున్నారు. సరిహద్దుల్లోకి సైన్యాన్ని, ఆయుధాలను వేగంగా చేరవేయడంతో పాటు.. ఎమర్జెన్సీ సమయంలో వేగంగా సహాయక చర్యలు చేపట్టేందుకు అవసరం అవుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.


చైనా, బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్‌ దేశాలతో భారత్ సరిహద్దు్ల్లో ఉన్న సుదూర ప్రాంతాలను కలుపుతూ ఏకంగా 500 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాలను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈశాన్య ప్రాంతాల్లో ఉండే కొండలు, లోయ ప్రాంతాల్లో రైల్వేల విస్తరణ తీవ్ర కష్టతరం అయినప్పటికీ.. వంతెనలు, సొరంగాలను నిర్మించనున్నారు. అయితే ఈ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టును కేవలం 4 ఏళ్లలో పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.


అయితే గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌ చైనా సంబంధాలు ఎప్పుడు ఎలా ఉంటున్నాయో చెప్పడం తీవ్ర కష్టంగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. రెండు దేశాల మధ్య సంబంధాలు మంచిగానే ఉన్నప్పటికీ.. భవిష్యత్‌ కోసం ముందుగానే భారత్ ప్రణాళికలు వేస్తోంది. అయితే గత 10 ఏళ్లలో ఈశాన్య రాష్ట్రంలో నిర్మించిన రోడ్డు మార్గాలకు అనుబంధంగా ఈ కొత్త రైలు మార్గాలు ఉండనున్నాయి. గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం.. రూ.1.07 లక్షల కోట్ల వ్యయంతో 9,984 కిలోమీటర్ల హైవేలను నిర్మించింది. అంతేకాకండా మరో 5,055 కిలోమీటర్ల రహదారులు నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పుడు నిర్మించ తలపెట్టిన కొత్త రైలు మార్గాల ద్వారా.. సైనిక సామగ్రిని రవాణా చేసేందుకు.. విపత్తుల సమయంలో వేగంగా సహాయక చర్యలు అందించేందుకు ఉపయోగపడనున్నాయి.


వీటితోపాటు 1962 నుంచి ఉపయోగంలో లేని ఈశాన్య రాష్ట్రాల సరిహద్దులోని అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్స్‌ను కూడా భారత్ తిరిగి క్రియాశీలకంగా మారుస్తోంది. హెలికాప్టర్లు, సైనిక విమానాలు ల్యాండ్ అయ్యేందుకు ఉపయోగించనున్నారు. ఇక వివాదాస్పద సరిహద్దు ప్రాంతమైన లడఖ్‌లోనూ కేంద్ర ప్రభుత్వం అదనంగా రైలు మార్గాలు నిర్మించేందుకు చర్చలు జరుపుతోంది. ఇక సున్నితమైన ప్రాంతాల్లో కనెక్టివిటీని పెంచేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారు. పాకిస్తాన్ సరిహద్దులో 1,450 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు.. డోక్లామ్ సమీపంలో అప్‌గ్రేడ్‌లు ఇందులో భాగమే. అయితే చైనా కూడా 2017 డోక్లామ్ ఘర్షణ తర్వాత సరిహద్దుల్లో.. ఎయిర్‌పోర్టులు, హెలిపోర్ట్‌ల వంటి కీలక మౌలిక సదుపాయాలను మరింత వేగవంతం చేసింది. తద్వారా సైనిక రవాణా సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa