అమెరికాలోని ప్రముఖ కన్సర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ హత్యతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. తన భర్త హత్య తర్వాత రెండు రోజులకే చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ ఒక హృదయాన్ని కదిలించే ప్రకటన చేశారు. కన్నీళ్లను ఆపుకుంటూనే.. ఆమె తన భర్తను "పరిపూర్ణమైన తండ్రి", "పరిపూర్ణమైన భర్త" అని అభివర్ణించారు. చార్లీకి మతం, కుటుంబం, దేశం పట్ల ఉన్న అంకితభావాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. దుఃఖాన్ని దిగమింగుతూనే.. తమ చిన్న కూతురితో "డాడీ జీసస్తో ఒక పనిపై వెళ్లారు" అని చెప్పినట్లు వివరించగా.. అందరూ కంటతడి పెట్టారు.
సెప్టెంబర్ 10న ఉతాలో జరిగిన ఓ కార్యక్రమంలోకన్సర్వేటివ్ రాజకీయ వ్యాఖ్యాత చార్లీ కిర్క్ పాల్గొన్నారు. ట్రంప్నకు అత్యంత సన్నిహితుడైన ఇతడు.. అక్కడే ప్రజల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ హత్యకు గురయ్యారు. అయితే భర్త చనిపోయిన రెండు రోజులకే భార్య మీడియా ముఖంగా షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా తన భర్త పాడ్కాస్ట్ సమయంలో ఉపయోగించి ఖాళీ కుర్చీ పక్కన నిలబడి మరీ.. ఆమె పోలీసులు, స్నేహితులు, మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తన భర్త ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని ప్రతిన పూనారు. "ఈ వితంతువు రోదనలు యుద్ధ నాదాలుగా ప్రపంచమంతా మారుమోగుతాయి" అని చెప్పారు.
"చార్లీ ఎప్పుడైనా ఎన్నికల్లో పోటీ చేస్తే.. అమెరికా కుటుంబాన్ని పునరుద్ధరించడమే తన మొదటి ప్రాధాన్యత అని చెప్పేవారు. అదే ఆయన ఆశయం" అని ఎరికా అన్నారు. "చార్లీకి జీవితం అంటే చాలా ఇష్టం. ఆయన తన జీవితాన్ని ప్రేమించారు. అలాగే అమెరికాను కూడా ప్రేమించారు" అని ఆమె భావోద్వేగంగా చెప్పారు. కన్సర్వేటివ్ యువజన బృందం 'టర్నింగ్ పాయింట్ USA' సహ వ్యవస్థాపకుడైన చార్లీ కిర్క్.. ఒరెంలోని ఉతా వ్యాలీ యూనివర్శిటీలో ఒక చర్చా కార్యక్రమానికి అతిథిగా వెళ్లి మాట్లాడుతుండగా.. కాల్పులకు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ హత్య గురించి ఆయన భార్య ఎరికా కిర్క్ మాట్లాడుతూ.. చార్లీ దేశభక్తి, విశ్వాసం, దేవుని దయగల ప్రేమ సందేశాన్ని బోధించినందుకే దుర్మార్గులు అతడిని చంపారని అన్నారు. "ఈ భార్యలో మీరు ఎంత అగ్నిని రాజేశారో మీకు తెలియదు. ఈ వితంతువు రోదనలు యుద్ధ నాదాలుగా ప్రపంచమంతా మారుమోగుతాయి" అని ఆమె హెచ్చరించారు. తన ప్రసంగం ముగింపులో.. ఎరికా యువతను తన భర్త ప్రారంభించిన ఉద్యమంలో చేరాలని కోరారు. ఆయన వారసత్వం ఎప్పటికీ అంతరించిపోనివ్వన అని ఆమె ప్రతిన పూనారు. ఆయన ఉద్యమాన్ని ఈ దేశం చూసిన వాటిలోకెల్లా అతి పెద్దదిగా చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.
మరోవైపు చార్లీ కిర్క్ను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 30 గంటల పాటు శ్రమించి మరీ అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనుమానితుడు టైలర్ రాబిన్సన్ను నేరస్థలం నుంచి 250 మైళ్ల దూరంలో ఉండగా... అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. అతడు నేరం చేసినట్లు తమకు ఫోన్ చేసి చెప్పాడని వివరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. వారిచ్చిన సమాచారం మేరకే వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. టైలర్ రాబిన్సన్ ప్రస్తుతం ఉతా కౌంటీ జైలులో ఉన్నారు. దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa