అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేస్తూ నాటో కూటమిలోని అన్ని దేశాలకు ఒక సంచలన లేఖను పంపించారు. ఈ లేఖలో ఆయన తన దార్శనికతను, షరతులను స్పష్టంగా వెల్లడించారు. తాను రష్యాపై కఠినమైన, భారీ ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నానని.. అయితే దానికి ముందు అన్ని నాటో దేశాలు కూడా అదే పని చేయడానికి అంగీకరించాలని అన్నారు. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను వెంటనే ఆపివేయాలని షరతు విధించారు.
విజయం సాధించడానికి నాటో నిబద్ధత 100 శాతం కంటే చాలా తక్కువగా ఉందని ట్రంప్ తెలిపారు. కొన్ని దేశాలు రష్యా చమురును కొనుగోలు చేయడం నిజంగా దిగ్భ్రాంతికరం అని ట్రంప్ ఆ లేఖలో పేర్కొన్నారు. నాటో దేశాల ఈ చర్యలు రష్యాపై తమకున్న బేరసారాలు, చర్చల స్థానాన్ని తీవ్రంగా బలహీనపరుస్తున్నాయని ఆయన విమర్శించారు. మీరు సుంకాలు విధించడానికి, చమురు కొనుగోలు చేయడం ఆపేయడానికి సిద్ధంగా ఉంటే నేను కూడా 50 నుంచి 100 శాతం సుంకాలు విధించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎప్పుడు యుద్ధం ప్రారంభిద్దామో చెప్పండంటూ వివరించారు.
రష్యా-ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న భయంకరమైన యుద్ధాన్ని ముగించడానికి తానొక వ్యూహం పన్నినట్లు తెలిపారు. ముఖ్యంగా నాటో కూటమిలోని అన్ని దేశాలు కలిసి చైనా ఉత్పత్తులపై 50 శాతం నుంచి 100 శాతం వరకు భారీ సుంకాలు విధించాలని ట్రంప్ ప్రతిపాదించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసిన తర్వాత ఈ టారిఫ్లను పూర్తిగా ఉపసంహరించుకోవాలని కూడా ఆయన స్పష్టం చేశారు. "చైనాకు రష్యాపై బలమైన పట్టు ఉంది. ఈ శక్తివంతమైన టారిఫ్లు ఆ పట్టును విచ్ఛిన్నం చేస్తాయి. ఇది ఈ యుద్ధం ముగియడానికి చాలా సహాయపడుతుంది" అని ట్రంప్ వివరించారు.
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన సమయంలో తాను అధ్యక్షుడిగా ఉంటే ఇది ఎప్పటికీ మొదలై ఉండేది కాదని ట్రంప్ అన్నారు. ఇది బైడెన్, జెలెన్స్కీల యుద్ధం మాత్రమేనని ట్రంప్ పేర్కొన్నారు. తాను కేవలం ఈ యుద్ధాన్ని ఆపడానికి, వేలాది మంది రష్యా, ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలను కాపాడటానికి మాత్రమే చేస్తున్న ప్రయత్నం అని చెప్పుకొచ్చారు. "గత వారం రోజుల్లోనే 7,118 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది చాలా దారుణంగా ఉంది" అని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే తాను చెప్పినట్లు నాటో చేస్తే.. యుద్ధం త్వరగా ముగుస్తుందని, రెండు దేశాల అమాయక ప్రజల ప్రాణాలు కాపాడినవాళ్లం అవుతామని స్పష్టం చేశారు. మీరు నా సమయాన్ని, అలాగే యునైటెడ్ స్టేట్స్ సమయం, శక్తి, డబ్బును వృధా చేస్తున్నారని నాటో దేశాలను ఆయన హెచ్చరించారు. ఈ లేఖకు చివరన "ఈ విషయానికి మీరు శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలు! డొనాల్డ్ జె. ట్రంప్, అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు" అని ఆయన సంతకం చేశారు. ఈ లేఖ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa