టీవీ రిమోట్కు సంబంధించిన చిన్నపాటి గొడవ ఒక కన్న తల్లి ప్రాణాలను బలిగొంది. ఈ దారుణమైన హత్య కేసులో దోషిగా తేలిన భారత సంతతి వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ.. బ్రిటన్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వెస్ట్ మిడ్ల్యాండ్స్ పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. గతేడాది సెప్టెంబర్లో ఈ ఘటన జరిగింది. 39 ఏళ్ల సుర్జిత్ సింగ్.. తన 76 ఏళ్ల తల్లి మొహిందర్ కౌర్ను హత్య చేశాడు. శుక్రవారం బర్మింగ్హామ్ క్రౌన్ కోర్టులో విచారణ సందర్భంగా.. ఈ హత్య వెనుక టీవీ రిమోట్కు సంబంధించిన గొడవే కారణమని తేలింది. మద్యం మత్తులో ఉన్న కుమారుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో తాను నేరం చేసినట్లు సుర్జిత్ సింగ్ కూడా అంగీకరించాడు. ఈక్రమంలోనే 15 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించిన తర్వాతే అతనికి పెరోల్ను పరిగణనలోకి తీసుకుంటారని కోర్టు పేర్కొంది.
బర్మింగ్హామ్లోని సోహో ప్రాంతంలో సుర్జిత్ సింగ్ తన తల్లితో కలిసి ఉంటున్నాడు. అయితే అప్పటికే అతడి తండ్రి చనిపోగా.. వీరిద్దరే జీవనం సాగిస్తున్నారు. తల్లి మొహిందర్ కౌర్ను అతడే చూసుకుంటూ వస్తున్నాడు. కానీ గతేడాది సెప్టెంబర్లో ఓరోజు అతడు ఫుల్లుగా మద్యం సేవించి వచ్చాడు. అలాగే డ్రగ్స్ కూడా తీసుకున్నాడు. ఇంటికొచ్చి టీవీ చూస్తున్నాడు. అప్పుడు రిమోట్ తల్లి తీసుకోవడంతో.. ఇవ్వమని అడిగాడు. ఆమె ఇంతలా తాగొచ్చావు, వెళ్లి పడుకో నీకెందుకు రిమోట్ అంటూ గద్దించింది. తల్లి తనపైనే కోప్పడటాన్ని జీర్ణించుకోలేకపోయిన సుర్జిత్ సింగ్.. ఆ క్షణంలో ఆవేశాన్ని అదుపు చేసుకోలేక తల్లిపై దాడి చేశాడు. ఆమె వద్దని బతిమాలుతూ పరుగులు తీస్తున్నా పట్టించుకోకుండా వెంటపడి మరీ విపరీతంగా కొట్టాడు. కింద పడేసి కాళ్లతో తొక్కుతూ, తన్నాడు. ఈక్రమంలోనే వృద్ధురాలైన మొహిందర్ కౌర్ చనిపోయింది.
విషయం గుర్తించిన సుర్జిత్ సింగ్ భయంతో వణికిపోయాడు. ఏం చేయాలో అర్థం కాక వెంటనే తన బంధువుకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. ఆపై ఇంటి నుంచి పారిపోయాడు. ఆందోళన చెందిన ఆ బంధువు వెంటనే 999 ఎమర్జెన్సీ నెంబర్కు ఫోన్ చేశారు. ఇలా పోలీసు అధికారులు వెంటనే ఆ ఇంటికి చేరుకొని.. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ మొహిందర్ కౌర్ గదిలో నేలపై పడి ఉండగా గుర్తించారు. ఆమెను వెంటనే బర్మింగ్హామ్లోని క్వీన్ ఎలిజబెత్ ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఇంకా ఆ ఇంటి వద్దే ఉండగా.. సుర్జిత్ సింగ్ తిరిగి సంఘటనా స్థలానికి వచ్చాడు.
ఇలా సుర్జిత్ సింగ్ ఇంట్లోకి రాగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై విచారించారు. ఈక్రమంలోనే అతడు "నేను కావాలని చేయలేదు. నేను నా మైండ్ను కోల్పోయాను" అని పోలీసులతో చెప్పాడు. అయితే మొహిందర్ కౌర్ శరీరంపై పలు దెబ్బల గుర్తులు ఉన్నాయని, కానీ దాడికి ఏదైనా ఆయుధం వాడారా లేదా అనేది స్పష్టంగా తెలియదని పోలీసులు తెలిపారు.
"ఈ అమానుషమైన హత్య ఒక కుటుంబాన్ని ముక్కలు చేసింది. దీనివల్ల ప్రభావితమైన అందరితో మా ఆలోచనలు నిరంతరం ఉంటాయి" అని వెస్ట్ మిడ్ల్యాండ్స్ పోలీస్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నిక్ బార్న్స్ అన్నారు. వృద్ధురాలు, బలహీనమైన మహిళపై కొంత కాలం పాటు ఈ దాడి జరిగిందని, ఆమె తనను తాను కాపాడుకోలేకపోయిందని సెంటెన్సింగ్ జడ్జ్ అభివర్ణించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa