టీ20 మ్యాచ్లో 8 మంది బ్యాటర్లు అవసరమా? టీమిండియాను ప్రశ్నించిన మాజీ క్రికెటర్(ఫోటోలు- Samayam Telugu)
ఆసియాకప్ 2025లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. మరికొన్ని గంటల్లో ఈ పోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ భారత తుది జట్టు ఎంపికను ప్రశ్నించారు. యూఏఈతో మ్యాచ్లో తుది జట్టు ఎంపికను ప్రశ్నించారు. టీ20 మ్యాచ్లోనూ ఎనిమిది మంది బ్యాటర్లు అవసరమా? అని వ్యాఖ్యానించారు.
యూఏఈతో మ్యాచ్లో భారత జట్టు కేవలం ముగ్గురు ప్రధాన బౌలర్లతో బరిలోకి దిగింది. పేసర్ బుమ్రా, స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ జట్టులో ఉన్నారు. ఇక ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబెలు జట్టులో ఉన్నారు. బ్యాటింగ్లో డెప్త్ పెంచాలనే లక్ష్యంగా టీ20ల్లో భారత్ తరఫున లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్న అర్షదీప్ సింగ్ను పక్కనపెట్టారు. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
“ఆసియాకప్లో మొదటి మ్యాచ్లో అర్షదీప్ సింగ్ను కచ్చితంగా ఆడించాల్సింది. 20 ఓవర్ల మ్యాచ్లోనూ భారత జట్టుకు ఎనిమిది మంది బ్యాటర్లు అవసరమా? మ్యాచ్లో అంతమంది బ్యాటర్లు ఎందుకు? నలుగురి కంటే ఎక్కువ మందికి బ్యాటింగ్ చేసేందుకు అసలు అవకాశం వస్తుందో.. లేదో.. కూడా మనకు తెలియదు కదా. దుబాయ్లో పిచ్లన్నీ స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్నాయి. దీంతో మీడియం పేసర్లకు సపోర్ట్ లభించడం లేదు. ఈ టోర్నీలో ఆసియాకప్ కూడా స్పిన్నర్లవైపే మొగ్గు చూపుతోంది” అని కృష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో అన్నారు.
ఇక పాకిస్థాన్తో మ్యాచ్లో ఆ దేశ బౌలర్లు అభిషేక్ శర్మ బాడీని టార్గెట్ చేస్తూ బంతులు సంధించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ అభిషేక్ ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే.. పాకిస్థాన్ బౌలర్ల బౌలింగ్లో ఈజీగా రన్స్ రాబడతాడని చెప్పుకొచ్చారు. కాగా ఆసియాకప్లో తమ తొలి మ్యాచ్లో భారత్.. యూఏఈతో తలపడింది. తొలుత ఆ జట్టును 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే ఆలౌట్ చేసింది. కుల్దీప్ యాదవ్ 4, శివమ్ దూబె 3 వికెట్లు తీశారు. ఆ తర్వాత టీమిండియా 4.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa