వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చురకలు అంటించారు. ప్రజాప్రతినిధుల ప్రవర్తన సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండాలని సూచించారు. అసెంబ్లీకి కనీసం 50 రోజులైనా హాజరు కావాలనే నిబంధన తప్పనిసరి చేయాలని చెప్పుకొచ్చారు. సభకు హాజరుకాకుండా ప్రభుత్వం గురించి జగన్ మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. ఇవాళ(ఆదివారం) తిరుపతిలో రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల మహిళా సాధికారత కమిటీ జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో అయ్యన్నపాత్రుడు పాల్గొని మాట్లాడారు. తిరుపతి లాంటి మహా పుణ్యక్షేత్రంలో మహిళా సాధికారిక సదస్సు జరగడం మంచి పరిణామమని ఉద్ఘాటించారు. మహిళలకు తండ్రి ఆస్తిలో సగం వాటా ఇచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్నేనని నొక్కిచెప్పారు. గతంలో ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు మహిళల ఆస్తి హక్కు గురించి చట్టం చేశారని గుర్తుచేశారు. ఉద్యోగాల్లో మహిళలకు ఎన్టీఆర్ రిజర్వేషన్ తీసుకువచ్చారని ఉద్ఘాటించారు. స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలను బలోపేతం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని నొక్కిచెప్పారు. ఒక మహిళను అసెంబ్లీకి స్పీకర్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్.. మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శప్రాయమని తెలిపారు. తిరుపతిలో మహిళా యూనివర్సిటీని పెట్టింది కూడా ఎన్టీఆరేనని గుర్తుచేశారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ హోం మినిస్టర్గా వంగలపూడి అనితను పరిచయం చేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు సీఎం చంద్రబాబు స్థానం కల్పించారని ఉద్ఘాటించారు. మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ విషయాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అయ్యన్నపాత్రుడు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa