ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచన చేసింది. రాష్ట్రంలో అల్పపీడనం, ద్రోణి ప్రభావం కారణంగా రాబోయే నాలుగు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనుండగా, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపింది.ఈ మేరకు ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటన విడుదల చేశారు. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నిలబడటం సురక్షితం కాదని హెచ్చరించారు.సోమవారం నాడు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వివరించారు. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడవచ్చని పేర్కొన్నారు.ఆదివారం సాయంత్రం 5 గంటల సమయానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు ఆయన తెలిపారు. అత్యధికంగా గుంటూరులో 81 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, పల్నాడు జిల్లా తుర్లపాడులో 54.5 మి.మీ, పెద్దకూరపాడులో 40.2 మి.మీ, గుంటూరు జిల్లా వంగిపురంలో 39.5 మి.మీ, కోనసీమ జిల్లా ముక్కామలలో 39 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు గణాంకాలను వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa