మహిళలు విద్యావంతులై, స్వావలంబన సాధించినప్పుడే భారత్ సమ్మిళిత, అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. మహిళా నేతృత్వంలో సాగే అభివృద్ధే 2047 నాటికి 'వికసిత్ భారత్' లక్ష్యాన్ని చేరుకోవడానికి బలమైన పునాది అని ఆయన అన్నారు. తిరుపతిలో తొలిసారిగా నిర్వహిస్తున్న పార్లమెంటు, రాష్ట్రాల మహిళా సాధికారత కమిటీల జాతీయ సదస్సును ఆయన ఆదివారం ప్రారంభించారు.‘వికసిత్ భారత్ కోసం మహిళా నేతృత్వంలో అభివృద్ధి’ అనే ప్రధాన అంశంతో ఈ రెండు రోజుల సదస్సు జరుగుతోంది. మహిళల అవసరాలకు తగిన బడ్జెట్ రూపకల్పన, ఆధునిక సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేలా మహిళలను శక్తివంతం చేయడం వంటి కీలక అంశాలపై ఇందులో చర్చిస్తారు. ఈ జాతీయ సదస్సుకు 20కి పైగా రాష్ట్రాల నుంచి చట్టసభల ప్రతినిధులు, విధాన రూపకర్తలు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ, దేశ ప్రగతిలో మహిళా సాధికారత, శిశు సంక్షేమం అనేవి సాధారణ అంశాలు కాదని, అవే దేశానికి పునాదులని నొక్కిచెప్పారు. పంచాయతీల నుంచి పార్లమెంటు వరకు ప్రతి స్థాయిలో మహిళల భాగస్వామ్యం పెరగాలని ఆయన ఆకాంక్షించారు. చట్టాలు, విధానాల రూపకల్పనలో మహిళల పాత్ర పెరిగినప్పుడే వారు చారిత్రకంగా ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించగలరని తెలిపారు.ప్రభుత్వ నిబద్ధతకు 'నారీశక్తి వందన్ అధినియమ్' బిల్లు ఒక చారిత్రక నిదర్శనమని ఓం బిర్లా కొనియాడారు. కొత్త పార్లమెంటు భవనంలో ఆమోదం పొందిన తొలి బిల్లు ఇదేనని గుర్తుచేశారు. ఈ చట్టం ద్వారా లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే కొత్త తరం మహిళా నాయకులను సిద్ధం చేస్తుందని ఆయన వివరించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ ఛైర్పర్సన్ దగ్గుబాటి పురందేశ్వరి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు, రాష్ట్ర మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa