ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసోంలో భారీ భూకంపం... అక్కడే ప్రధాని మోదీ

national |  Suryaa Desk  | Published : Sun, Sep 14, 2025, 08:50 PM

ఈశాన్య రాష్ట్రం అసోంలో ఆదివారం సాయంత్రం భూకంపం సంభవించింది. గౌహతి సమీపంలో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4.41 గంటల సమయంలో రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతతో భూకంపం వచ్చినట్టు నేషనల్ సిస్మాలజీ సెంటర్ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర బెంగాల్ సహా సరిహద్దుల్లో భూటాన్‌లోనూ భూప్రకంపనలు నమోదయ్యింది. పది రోజుల కిందట అసోంలోని సోనిత్‌పూర్‌లో సెప్టెంబరు 2న 3.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. ప్రస్తుత భూకంపం కారణంగా జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఇప్పటి వరకూ ఎటువంటి సమాచారం లేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆదివారం అసోంలో పర్యటించారు. ఆ రాష్ట్రంలో ఆయన పర్యటన సాగుతున్న సమయంలో భూకంపం రావడంతో ఆందోళన నెలకుంది.


అసోం సీఎం హిమాంత బిశ్వ శర్మ స్పందిస్తూ.. ‘భూకంప కారణంగా భారీ ప్రాణ, ఆస్తి నష్టంపై ఎటువంటి నివేదికలు లేరు.. పరిస్థితులను అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తోంది’ అని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అసోం మాజీ సీఎం, కేంద్ర మంత్రి శర్వానంద్ సోనోవాల్ సూచించారు. ‘అసోంలో భారీ భూకంపం సంభవించింది.. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను.. అప్రమత్తంగా ఉండాలి’ అని ఎక్స్‌ (ట్విట్టర్)లో ఆయన ట్వీట్ చేశారు.


కాగా, అసోం భూకంపం ప్రస్తుతం ఎక్స్‌లో ట్రెండ్ అవుతోంది. గువహటి ప్రజలు ఎక్స్ వేదికగా ఫోటోలను, సమాచారాన్ని పంచుకుంటున్నారు. భూకంపంతో ఇళ్లలో వస్తువులు, పూల కుండీలు, సామాగ్రి కదులుతుండటం, గోడలు బీటలు వారడం వంటివి ఉన్నాయి. కాగా, పది రోజుల కిందట అఫ్గనిస్థాన్‌లో చోటుచేసుకున్న భూకంపంలో 1000 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది గాయపడ్డారు. భారీ ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది.


కాగా, మేఘాలయ, మణిపూర్, త్రిపుర ప్రజలు కూడా తమ ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చినట్లు తెలిపారు. అలాగే, పొరుగున ఉన్న బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, చైనాలోనూ ఈ భూకంప ప్రభావం కనిపించింది. అక్కడ కూడా భూమి కంపించినట్టు నివేదికలు పేర్కొన్నాయి. అయితే, దీని తీవ్రత గురించి స్పష్టత రాలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa