ఎన్సీపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఓ మహిళా ఐపీఎస్తో ఫోన్లో వాగ్వాదానికి దిగిన విషయం దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా, పుణేలో జరిగిన ఓ కార్యక్రమంలో గోవా మాజీ ముఖ్యమంత్రి, దివంగత మనోహర్ పారికర్ ఎవరంటూ అజిత్ పవార్ ప్రశ్నించి చిక్కుల్లోపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం పుణే కేశవ్నగర్లో అజిత్ పవార్ పర్యటించారు. స్థానికులతో మాట్లాడుతూ ఆయన వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ రద్దీ, ఇతర సమస్యలను స్థానికులు లేవనెత్తారు. దీనిపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించి పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అయితే, ఇంతలోనే ఓ మహిళ.. దివంగత మనోహర్ పారికర్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన గోవా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆకస్మిక తనిఖీలు చేపట్టి, సమస్యలను స్వయంగా తెలుకుని చర్యలు తీసుకునేవారని చెప్పింది. తమ ప్రాంతంలోనూ అటువంటి చర్యలు తీసుకోవాలని ఆ మహిళ కోరారు. ఈ క్రమంలో అజిత్ పవార్ జోక్యం చేసుకుని.. అసలు పారికర్ ఎవరు? అంటూ ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం అలా అనేసరికి మహిళ సహా అక్కడున్నవారంతా తెల్లమొహం వేశారు. కానీ, వెటనే ఆమె... పారికర్ గోవా మాజీ ముఖ్యమంత్రి అని, కేంద్ర రక్షణ శాఖ మంత్రిగానూ పనిచేశారని బదులిచ్చారు. ప్రస్తుతం ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మైనింగ్ విషయంలో మహిళా ఐపీఎస్ అధికారిణితో అజిత్ పవార్ వాగ్వాదానికి దిగడం విమర్శలు వెల్లువెత్తాయి.
ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి అయిన డాక్టర్ మనోహర్ పారికర్.. గోవాకు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రధాన మంత్రి మోదీ మొదటి క్యాబినెట్లో రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మూడేళ్ల పాటు ఆయన మంత్రిగా కొనసాగారు. నిరాడంబర శైలి, పాలనాపర నైపుణ్యాలతో పారికర్ గుర్తింపు పొందారు. గోవాలో తన పాత చేతక్ స్కూటర్పై సామాన్యుడిలా తిరుగుతూ ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేవారు. జీర్ణాశయ కేన్సర్ బారినపడిన ఆయన.. అమెరికాలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. కానీ, మళ్లీ కొద్ది రోజుల్లోనే వ్యాధి తిరగబెట్టి 2019లో మృతి చెందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa