వారంతా విద్యార్థులు.. ప్రభుత్వం నడుపుతున్న హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. కుటుంబం ఆర్థిక పరిస్థితులు కూడా అంతంతమాత్రమే. తమ పిల్లలు బాగా చదువుకోవాలని.. తమలా ఇబ్బందులు పడకూడదని, ప్రయోజకులుగా మారాలని ఆశిస్తూ వారి తల్లిదండ్రులు వారిని ఆ హాస్టల్లో చేర్చారు. కానీ వారు చేసిన పని మాత్రం తలవంపులు తెచ్చిపెడుతోంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లి బాలుర వసతి గృహం ( బాయ్స్ హాస్టల్లో ) ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గొల్లనపల్లి జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో బాయ్స్ హాస్టల్ ఉంది. ఈ బాలుర వసతి గృహంలో కాశిమ్మ అనే మహిళ వంటమనిషిగా పనిచేస్తోంది. అయితే హాస్టల్లోని కొందరు విద్యార్థుల వద్ద మందు బాటిల్ ఉన్న విషయాన్ని వంటమనిషి కాశిమ్మ గుర్తించింది.
హాస్టల్ భవనంపై ఉన్న కొంతమంది విద్యార్థుల వద్ద మద్యం సీసా ఉన్న విషయాన్ని శనివారం సాయంత్రం కాశిమ్మ గమనించింది. చదువు కోవాల్సిన వయసులో ఇదేం పని అంటూ విద్యార్థులను ప్రశ్నించింది. హాస్టల్ వార్డెన్తో చెబుతానని విద్యార్థులను హెచ్చరించింది. దీంతో కాశిమ్మపై కోపం పెంచుకున్న నలుగురు విద్యార్థులు.. ఆమెపై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. వంట పనులు చేస్తున్న సమయంలో కాశిమ్మ వెనుక నుంచి వచ్చి దాడి చేశారు. కాశిమ్మపై దుప్పటి కప్పి విద్యార్థులు దాడి చేయటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. మరోవైపు విద్యార్థుల దాడిలో గాయపడిన కాశిమ్మను గన్నవరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఈ ఘటనపై హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హాస్టల్ వద్దకు చేరుకున్న పోలీసులు.. విద్యార్థుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. గొల్లనపల్లి బాలుర వసతి గృహంలో 40 మంది విద్యార్థులు ఉన్నారు. మరోవైపు ఈ ఘటనపై హాస్టల్ వార్డెన్ వివరణ మరోలా ఉంది. హాస్టల్లో విద్యార్థులు ఎవరూ మద్యం తాగలేదని వార్డెన్ చెప్తున్నారు. కాశిమ్మపై ఎందుకు దాడి చేశారనే వివరాలను తెలుసుకుంటున్నట్లు చెప్పారు. దొరికిన మందు సీసా కూడా వంటమనిషి కాశిమ్మ కుటుంబసభ్యులదని వార్డెన్ చెప్తున్నారు. ఈ ఘటనపై విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్తున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa