ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం శుభవార్త వినిపించింది. ఏపీలో 17 అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుకు ( ఫైర్ స్టేషన్లు) 15వ ఆర్థిక సంఘం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఏపీ అగ్నిమాపక సేవల డైరెక్టర్ జనరల్ పీవీ రమణ వెల్లడించారు. కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అగ్నిమాపక సేవల పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈ విషయాన్ని వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘం.. ఏపీలోని అగ్నిమాపక సేవల విభాగానికి రూ.252 కోట్ల బడ్జెట్ను మంజూరు చేసిందని, అందులో భాగంగా మొదటి దశలో రూ.72 కోట్లు విడుదల చేసిందని డైరెక్టర్ జనరల్ పీవీ రమణ తెలిపారు. 5 మినీ రెస్క్యూ టెండర్లు, 50 అడ్వాన్స్డ్ వాటర్ టెండర్లు, 20 వాటర్ బ్రౌజర్లు, 40 కాన్వాయ్ వాహనాలు, 46 ఇతర వాహనాలకు టెండర్లు పిలిచినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 36 అగ్నిమాపక కేంద్ర భవనాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, పనులు చివరి దశలో ఉన్నాయని ఆయన తెలిపారు.
మరోవైపు ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటి వరకూ1,498 అగ్ని ప్రమాదాలు జరిగాయని ఏపీ అగ్నిమాపక సేవల డైరెక్టర్ జనరల్ పీవీ రమణ వెల్లడించారు. ఈ ప్రమాదాల్లో చిక్కుకున్న 51 మందిని రక్షించామని, రూ.108 కోట్ల విలువైన ప్రజా ఆస్తిని ఆదా చేశామని వివరించారు. మరోవైపు అగ్నిమాపక సేవల శాఖ 2021-22 గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగానే NOCలలో సవరణలు చేస్తున్నట్లు తెలిపారు. అగ్నిమాపక సేవల చట్టం, 1999 ప్రకారం భవనాల్లో అగ్నిమాపక పరికరాలు ఉండేలా ఆదేశాలు ఇచ్చామని అన్నారు. NOCలు పొందిన సమయంలో భవన యజమానులు తమ భవనాలు అగ్నిమాపక సేవల చట్టం1999కి అనుగుణంగా ఉన్నాయో లేదో.. 30 రోజుల్లోపు అగ్నిమాపక సేవల విభాగానికి తెలియజేయాలని స్పష్టం చేశారు.
మరోవైపు ఏపీలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. రూ.1,120 కోట్ల నిధులను సెప్టెంబరు మొదటి వారంలో పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్తులకు విడుదల చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. రెండో విడత రూ.1,120 కోట్ల విడుదల కావాల్సి ఉండగా.. ఇందులో జాప్యం జరిగింది. దీంతో పలువురు సర్పంచులు ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయమై సీఎం నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ నెల మొదటి వారంలో రూ.1,120 కోట్ల నిధులను రాష్ట్ర ఆర్థికశాఖ పంచాయతీలకు 70 శాతం, మండల పరిషత్తులకు 20 శాతం, జిల్లా పరిషత్తులకు పది శాతం చొప్పున విడుదల చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa