ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తన పేరు ఫొటోల దుర్వినియోగంపై కరణ్ జోహర్ ఆగ్రహం

national |  Suryaa Desk  | Published : Mon, Sep 15, 2025, 08:31 PM

బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహర్ తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టారు. తన పేరు, ఫొటోలు, గుర్తింపును అనధికారికంగా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోవడాన్ని నిరోధించాలని కోరుతూ ఆయన న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ఇదే తరహా కేసుల్లో నటులు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్‌లకు అనుకూలంగా కోర్టు తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో కరణ్ జోహర్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.తన అనుమతి లేకుండా కొందరు తన పేరు, ఫొటోలతో టీ-షర్టులు, మగ్‌లు, పోస్టర్లు వంటి వస్తువులను తయారు చేసి అమ్ముతున్నారని కరణ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ చర్యల వల్ల తన ప్రతిష్ఠకు, బ్రాండ్ విలువకు నష్టం వాటిల్లుతోందని, వీటిని వెంటనే అడ్డుకోవాలని కోర్టును అభ్యర్థించారు. ఇదివరకే అభిషేక్, ఐశ్వర్యారాయ్ ఇదే అంశంలో పిటిషన్లు వేయగా విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సెలబ్రిటీల పేరు, ఫొటో, సంతకం వంటి గుర్తింపు అంశాలు వారి వృత్తిపరమైన జీవితంతో ముడిపడి ఉంటాయని, వాటిని దుర్వినియోగం చేయడం వారి ప్రతిష్ఠను దెబ్బతీయడమేనని కోర్టు వ్యాఖ్యానించింది.ఐశ్వర్యారాయ్ కేసులోనైతే టీ-షర్టులు, మగ్‌లు వంటి వాటిపై ఆమె చిత్రాన్ని వాడటాన్ని నిషేధించడంతో పాటు, ఏఐ-జనరేటెడ్ కంటెంట్, డీప్‌ఫేక్‌లు, ఫేస్ మార్ఫింగ్ వంటి డిజిటల్ మార్పుల ద్వారా ఆమె ప్రతిష్ఠకు భంగం కలిగించడాన్ని కూడా కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇప్పుడు ఇదే తరహా రక్షణను కోరుతూ కరణ్ జోహర్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ పిటిషన్‌పై విచారణ తేదీలు ఇంకా ఖరారు కాలేదు.కరణ్ జోహర్ చివరగా ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఆయన నిర్మాతగా వరుణ్ ధావన్, జాన్వీ కపూర్‌లతో ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారీ’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa