అమెరికా కంపెనీల్లో విదేశీ వర్కర్ల నియామకం విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. తమ దేశీయ పరిశ్రమల్లో విదేశీ కార్మికుల అవసరం ఉందని పేర్కొన్నారు. అగ్రరాజ్యంలో పెట్టుబడులపై తాము పునరాలోచిస్తామంటూ దక్షిణ కొరియా హెచ్చరించిన నేపథ్యంలో దెబ్బకు ట్రంప్ దిగొచ్చారు. రెండోసారి అధ్యక్షుడిగా ఈ ఏడాది జనవరిలో డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అమెరికాలో వారు ఎక్కడున్నా వెతికి మరీ పట్టుకుని వెనక్కి పంపుతున్నారు. కొందర్ని నిర్బంధ కేంద్రాల్లో ఉంచుతున్నారు.
ఈ క్రమంలో పది రోజుల కిందట జార్జియా రాష్ట్రంలోని హ్యుందయ్-ఎల్జీ ప్లాంట్లో హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు చేపట్టి 475 మంది దక్షిణ కొరియా పౌరులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా అక్రమ వలసదారులేనని హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. ఇది ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ అంశంపై దక్షిణకొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ తీవ్రంగా స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ దేశానికి చెందిన వ్యాపార సంస్థలు అమెరికాలో పెట్టుబడులకు వెనకాడతాయని హెచ్చరించారు. పునరాలోచించాల్సి ఉంటుందని మ్యూంగ్ చేసిన ప్రకటన అమెరికా అధ్యక్షుడ్ని కలవరానికి గురిచేసింది. దీనిపై ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్టు పెట్టారు.
‘‘సంక్లిష్టమైన, అత్యంత ప్రత్యేకమైన వస్తువులను తయారుచేస్తోన్న విదేశీ పరిశ్రమలు అమెరికాలో భారీగా పెట్టుబడులు పెట్టినప్పుడు నైపుణ్యం కలిగిన వర్కర్లు అవసరం ఉంటుంది.. నిపుణులైన విదేశీ ఉద్యోగులను కొద్దికాలం మా దేశానికి వారు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను.. చిప్స్, సెమి-కండక్టర్లు, కంప్యూటర్లు, నౌకలు, రైళ్లు సహా అనే ఉత్పత్తులపై నిపుణుల నుంచి మన కార్మికులు శిక్షణ తీసుకోవాలి.. లేకుంటే ఆ భారీ పెట్టుబడుల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.. పెట్టుబడులు పెడుతోన్న విదేశీ సంస్థల ఉద్యోగులను మేము స్వాగతిస్తున్నాం. వారినుంచి మేము నేర్చుకొని, వారికంటే మరింత మెరుగ్గా రాణిస్తాం’’ అని ట్రంప్ తెలిపారు.
కాగా, ట్రంప్ దేశవ్యాప్తంగా అక్రమవలసలపై విస్తృత చర్యలు ప్రారంభించిన తర్వాత జరిగిన అతిపెద్ద సింగిల్-సైట్ ఆపరేషన్ జార్జియాదే. దాడి సమయంలో కార్మికులను గొలుసులతో బంధించి, చేతులకు సంకెళ్లు వేసినట్లు ఉన్న ఫోటోలు దక్షిణ కొరియాలో విస్తృత ఆందోళనకు దారితీశాయి. సియోల్ శుక్రవారం ఈ కార్మికులను స్వదేశానికి రప్పించింది. తీవ్రంగా మండిపడిన దక్షిణ కొరియా... భవిష్యత్తులో పెట్టుబడుల విషయమై పునరాలోచన చేస్తామని హెచ్చరించింది. ఈ పరిణామాలతో ట్రంప్ అలర్ట్ అయ్యారు. వెంటనే తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ఈ మేరకు ఆయన పోస్ట్ పెట్టడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa