ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాస్ వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య.. కంపెనీ రూ.90 కోట్లు పరిహారం చెల్లించాలన్న కోర్టు

international |  Suryaa Desk  | Published : Mon, Sep 15, 2025, 09:09 PM

కంపెనీలో బాస్ పెట్టే ఒత్తిడి, వేధింపులు తట్టుకోలేని ఓ యువతి.. మొదట డిప్రెషన్‌కు గురైంది. ఆ తర్వాత సెలవులపై వెళ్లినా ఆమె ఆ డిప్రెషన్ నుంచి బయటికి రాలేదు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు కూడా యత్నించింది. దీంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే కొంతకాలం ఆస్పత్రిలో చికిత్స పొందినా.. ప్రయోజనం లేకపోయింది. చివరికి తనువు చాలించింది. అయితే ఆమె చనిపోవడానికి ముందే.. ఆ యువతి కుటుంబం.. సదరు సంస్థ పరిహారం చెల్లించాలని కేసు వేసింది. యువతి చనిపోవడానికి కారణం.. ఆ కంపెనీనే అని తేల్చిన కోర్టు.. భారీ ఫైన్ వేసింది. ఏకంగా ఆ యువతి కుటుంబ సభ్యులకు రూ.90 కోట్లు చెల్లించడమే కాకుండా.. దీనంతటికీ కారణం అయిన ఆ కంపెనీ బాస్.. తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఆదేశించింది. జపాన్‌లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


జపాన్‌ రాజధాని టోక్యోలో ఉన్న డీ అప్ కార్పొరేషన్‌ అనే సంస్థలో 25 ఏళ్ల సతోమి అనే యువతి.. 2021లో ఉద్యోగానికి చేరింది. ఈ క్రమంలోనే అదే ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఒక మీటింగ్‌లో ఆ కంపెనీ బాస్ మిత్సురు సకాయి.. సతోమిని తీవ్రంగా తిట్టాడు. ఆమె ఒక చిన్న తప్పు చేస్తే.. తీవ్రంగా దూషించాడు. కంపెనీ అనుమతి లేకుండా క్లయింట్‌ను కలవడంతో.. ఆమెను వీధి కుక్కతో పోల్చి తిట్టాడు. అయితే మిత్సురు సకాయి.. దూషించడంతో సతోమి.. మానసికంగా తీవ్రంగా కుంగిపోయింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 2021లో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఇక ఆమెను పరిశీలించిన డాక్టర్లు.. ఆమెకు విశ్రాంతి అవసరం అని సూచించారు. దీంతో 2022 జనవరి నుంచి సతోమి సెలవుపై వెళ్లింది.


అయితే అప్పటికీ ఆ బాధ నుంచి తేరుకోని సతోమి.. 2022 ఆగస్టులో ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ సమయంలో చావు నుంచి బయపడిన సతోమి.. కోమాలోకి వెళ్లింది. ఏడాదికిపైగా కోమాలోనే ఉన్న సతోమి.. చివరికి 2023 అక్టోబర్‌లో ప్రాణాలు విడిచింది. అయితే సతోమి చనిపోవడానికి ముందే 2023 జూలైలో.. ఆమె తల్లిదండ్రులు డీఅప్ కార్పొరేషన్ కంపెనీతోపాటు.. దాని బాస్ మిత్సురు సకాయిపై నష్టపరిహారం కోసం కోర్టులో దావా వేశారు. విచారణ జరిపిన కమిటీ.. మిటా లేబర్ స్టాండర్డ్స్ ఇన్‌స్పెక్షన్ కార్యాలయం.. కంపెనీ బాస్ మిత్సురు సకాయి చేసిన వేధింపుల కారణంగానే సతోమి డిప్రెషన్‌కు గురై, ఆత్మహత్య చేసుకోవడానికి కారణమని నిర్ధారించింది. దీంతో సతోమి మరణం.. పని ప్రదేశంలో జరిగిన ప్రమాదంగా తేల్చేశారు.


ఈ క్రమంలోనే ఈ కేసులో విచారణ జరిపిన టోక్యో డిస్ట్రిక్ట్ కోర్టు.. ఈనెల 9వ తేదీన తీర్పును వెలువరించింది. బాస్ మిత్సురు సకాయ్ వేధింపుల వల్లే ఉద్యోగి సతోమి మరణించినట్లు స్పష్టం చేసింది. దీనికి పరిహారంగా 150 మిలియన్ యెన్‌లు (భారత కరెన్సీలో దాదాపు రూ.90 కోట్లు) బాధిత యువతి కుటుంబానికి అందించాలని తెలిపింది. కోర్టు తీర్పు తర్వాత.. డీ అప్ కార్పొరేషన్ సంస్థ బాస్ మిత్సురు సకాయి తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ఆ కంపెనీ.. తమ వెబ్‌సైట్‌లో క్షమాపణలు చెప్పింది. తమ కంపెనీలో పనిచేసే మాజీ ఉద్యోగి, ఆమె కుటుంబానికి క్షమాపణలు చెబుతున్నామని.. కంపెనీలో ఉన్న అంతర్గత వ్యవస్థలను మెరుగుపరచుకునేందుకు కృషి చేస్తామని వెల్లడించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa