ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమ వలసదారులపై ట్రంప్ కీలక నిర్ణయాలు

international |  Suryaa Desk  | Published : Mon, Sep 15, 2025, 09:11 PM

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్‌లో భారత సంతతికి చెందిన చంద్ర నాగమల్లయ్య దారుణ హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ అమానుష ఘటనపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. నిందితుడిపై 'ఫస్ట్ డిగ్రీ మర్డర్' నేరం కింద పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు. అలాగే తన పాలనలో అమెరికాను మళ్లీ సురక్షితంగా మారుస్తానని, అక్రమ వలసదారులు, నేరస్థుల పట్ల ఇక ఏ మాత్రం మెతక వైఖరి ఉండబోదని స్పష్టం చేశారు.


ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికపై ఈ ఘటన గురించి ప్రస్తావిస్తూ.. టెక్సాస్‌లోని డల్లాస్‌లో బాగా పేరున్న వ్యక్తి చంద్ర నాగమల్లయ్య దారుణ హత్య గురించి నేను తెలుసుకున్నానన్నారు. ఒక క్యూబన్ అక్రమ వలసదారుడు.. భార్య, కుమారుడి కళ్లెదుటే దారుణంగా అతడి తల నరికేశాడని వివరించారు. అలాంటి వ్యక్తి మన దేశంలో అస్సలు ఉండాల్సింది కాదని రాసుకొచ్చారు.


51 ఏళ్ల భారత సంతతి వ్యక్తి చంద్రమౌళి నాగమల్లయ్య డలాస్‌లోని మోటెల్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. 37 ఏళ్ల వయసు కల్గిన యొర్డానిస్ కోబోస్-మార్టినెజ్ అనే వ్యక్తి అక్కడే ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మోటెల్లోనే ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలోనే అక్కడే ఓ పాడుబడిన వాషింగ్ మిషన్ ఉండగా.. యొర్డానిస్ కోబోస్-మార్టినెజ్ అందులో బట్టలు ఉతుక్కున్నాడు. అయితే అది ఏమాత్రం సహించని చంద్రమౌళి నాగమల్లయ్య నేరుగా అతడి వద్దకే వెళ్లి నువ్వు చేసే పని నాకు నచ్చలేదని చెప్పడానికి బదులుగా.. అతడి తోటి మహిళా ఉద్యోగికి విషయం చెప్పాడు. దాన్ని వాడకూడదని చెప్పమని వివరించాడు. ఈక్రమంలోనే ఆమె వెళ్లి నిందితుడికి పాడుబడిన వాషింగ్ మిషన్ వాడొద్దని చెప్పింది.


దీంతో నాగమల్లయ్యపై విపరీతమైన కోపం తెచ్చుకున్న అతడు నేరుగా వెళ్లి తన గదిలోంచి ఓ కత్తి తెచ్చుకున్నాడు. ఆపై నాగమల్లయ్య వద్దకు వెళ్లి గొడవ పడ్డాడు. కత్తితో పదే పదే దాడి చేశాడు. ముఖ్యంగా తల, మొండం వేరయ్యే వరకు కత్తితో నరుకుతూనే ఉన్నాడు. అయితే అతడు దాడి చేస్తున్నప్పుడు బాధితుడి భార్య, కుమారుడు కూడా అక్కడే ఉండి వద్దని వారించారు. అయినా వినకుండా నాగమల్లయ్యను చంపేసి.. ఆపై తలను బయటకు తీసుకెళ్లాడు. పార్కింగ్ స్థలంలో పడేసి కాళ్లతో తన్నుతూ.. ఆపై చెత్తబుట్టలో పడేసి పారిపోయాడు. అప్పటికే పోలీసులకు మోటల్ సిబ్బంది ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని వెంటాడి మరీ పట్టుకున్నారు.


హంతకుడు మార్టినెజ్‌కు గతంలోనే నేర చరిత్ర ఉందని పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా అతడు చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు, వాహనాల దొంగతనం వంటి అనేక నేరాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఇదే విషయంపై ట్రంప్ స్పందిస్తూ.. బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో ఈ వ్యక్తిని జైలు నుంచి బయటకు వదిలేశారని గుర్తు చేశారు. అలాగే క్యూబా ప్రభుత్వం కూడా ఇలాంటి దుష్టుడిని తమ దేశంలో ఉంచుకోవడానికి నిరాకరించిందన్నారు. అందుకే అతడు అమెరికాకి వచ్చి నేరాలు చేసి దొరికిపోయినా.. బైడెన్ దయ వల్ల బయటకు వచ్చి మరో దారుణానికి తెగబడ్డాడని అన్నారు. బైడెన్ ఆరోజు ఇతడిని వదిలి ఉండకపోతే ఇంత దారుణం జరిగేది కాదన్నారు. అలాగే తన పాలనలో అక్రమ వలసదారుల నేరాలను ఉపేక్షించే సమయం ముగిసిందని ట్రంప్ స్పష్టం చేశారు.


ఈ ఘటనపై అమెరికా హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగం కూడా స్పందించింది. డీహెచ్‌ఎస్ అసిస్టెంట్ సెక్రటరీ ట్రిషా మెక్‌లాఫ్లిన్ బైడెన్ ప్రభుత్వ విధానాలను విమర్శించారు. మార్టినెజ్ లాంటి నేరస్తుడిని దేశంలోకి అనుమతించి ఉండకపోతే ఈ హత్య జరిగి ఉండేది కాదని అన్నారు. డీహెచ్‌ఎస్ ప్రకారం.. మార్టినెజ్ 2025 జనవరి 13వ తేదీన బైడెన్ ప్రభుత్వంలో ఒక పర్యవేక్షణ ఆర్డర్ కింద ఐస్‌ (ICE) నిర్బంధం నుంచి విడుదలయ్యాడు. ఈ ఘటన అమెరికాలో అక్రమ వలసదారుల సమస్యను, రాజకీయ చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa