ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుడికి వెళ్లి వస్తుండగా ప్రమాదం... ఇన్ఫోసిస్‌ ఉద్యోగిని మృతి

Crime |  Suryaa Desk  | Published : Mon, Sep 15, 2025, 09:12 PM

తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశ వ్యాప్తంగా ప్రతి రోజుల వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా వరకు మద్యం మత్తు, నిద్రమత్తు, అతివేగం వంటి కారణాల వల్లే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలు నిత్య కృత్యమయ్యాయి. ప్రతి రోజు ఏదో ఒక చోట రహదారులు రక్తమోడుతూనే ఉన్నాయి. ఇక తాజాగా నేడు అనగా సోమవారం నాడు ఔటర్ రింగ్ రోడ్డు మీద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యాక్సిడెంట్‌లో ఇన్ఫోసిస్ ఉద్యోగిని ఒకరు స్పాట్‌లోనే చనిపోయారు. ఆ వివరాలు..


ప్రమాదం వివరాలకు వస్తే.. పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొంగుళూరు గేట్ నుంచి పోచారం వైపుగా వెళ్తున్న ఓ ఇన్నోవా కారు ఒకటి అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇన్ఫోసిస్ ఉద్యోగిని అయిన సౌమ్యా రెడ్డి అనే యువతి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.


ప్రమాదంలో గాయపడిన వారిని శ్రుతి, ఝాన్సీ, వీరేంద్ర, ప్రనీష్, కిశోర్‌, అరవింద్‌, సాగర్‌లుగా గుర్తించారు. వీరంతా కూడా ఇన్ఫోసిస్ ఉద్యోగులే. ప్రమాదంలో చనిపోయిన సౌమ్యారెడ్డితో పాటు వీరంతా కలిసి సరళమైసమ్మ దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.


అయితే అతి వేగం, డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గురైన కారు నంబర్ TS07 FQ 3399గా గుర్తించారు. బాధిత కుటుంబాలకు ప్రమాదం గురించి సమాచారం అందించారు. గాయపడ్డ వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు. అలానే ఈ ప్రమాదంలో చనిపోయిన సౌమ్యారెడ్డి స్వస్థలం.. సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలం వావిలాలగా గుర్తించారు.


రోడ్డు ప్రమాదాలు అనగానే ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం, అతివేగం, మద్యం మత్తే కారణం అనుకుంటారు. అయితే అన్ని సందర్భాల్లో ఇవే కారణాలు ఉండవు. కొన్ని సార్లు మనం ఎంత జాగ్రత్తగా.. అన్ని నియమాలు పాటిస్తూ.. నెమ్మదిగా వెళ్తున్నా సరే.. ఎదుటి వారి నిర్లక్ష్యం వల్ల కూడా ప్రమాదాల బారిన పడాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా ఓఆర్ఆర్ వంటి హైవేల మీద ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు స్పీడ్ లిమిట్‌ని పాటించాలి. అతి వేగంతో వాహనాలు నడిపితే మనతో పాటు.. ఇతరులకు కూడా ఇబ్బందే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే చాలా వరకు ప్రమాదాలను అరికట్టవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa