ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడలో దారుణం.. దోశ మారినందుకు కత్తితో దాడి

Crime |  Suryaa Desk  | Published : Mon, Sep 15, 2025, 09:13 PM

ఆర్డర్ ఇచ్చిన దోశ కాకుండా వేరే దోశ ఇచ్చారేంటని ప్రశ్నించినందుకు హోటల్ సిబ్బంది ఓ కస్టమర్‌పై కత్తితో దాడి చేశాడు. విజయవాడ వైఎస్సార్ కాలనీ సర్కిల్‌లోని వెల్‌కమ్ హోటల్‌లో ఈ ఘటన జరిగింది. శనివారం రాత్రి వెల్‌కమ్ హోటల్‌కు టిఫిన్ కోసం వెళ్లిన అబ్దుల్ కరీం.. ఉప్మా దోశ పార్సిల్ కావాలని ఆర్డర్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత.. వాళ్లు ఇచ్చిన దోశ పార్శిల్ తీసుకుని కరీం వెళ్లిపోయాడు. తీరా ఇంటికి వెళ్లి చూసిన తర్వాత పార్సిల్‌లో ఉప్మా దోశ బదులు.. ప్లెయిన్ దోశ ఉంది. ఇదేంటని తిరిగి హోటల్‌కు వచ్చిన అబ్దుల్ కరీం.. హోటల్ సిబ్బందిని ఇలా ఎందుకు చేశారని నిలదీశాడు. ఈ క్రమంలోనే హోటల్ సిబ్బందితో కరీంకు.. మాటామాట పెరగింది. అది గొడవకు దారితీసింది. సహనం కోల్పోయిన హోటల్ సిబ్బంది అబ్దుల్ కరీంపై కత్తితో దాడి చేశారు. దీంతో ఆయన మెడపై తీవ్ర గాయం అయ్యింది. ఈ క్రమంలోనే తీవ్ర రక్తస్రావం అయ్యింది. వెంటనే ఆయన్ను బంధువులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే, కరీం బంధువులు హోటల్ యజమానులను నిలదీశారు. దీంతో వారు.. తప్పు జరిగింది.. మేం ఏం కావాలని చేయమనలేదని వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించి ఓ వీడియో బయటకు వచ్చింది. అయితే, కరీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కొత్తపేట పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏదేమైనప్పటికి.. గొడవ జరిగితే కత్తితో దాడి చేస్తారా అని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. తీవ్ర రక్తస్రావంతో మనిషి ప్రాణాలు పోతే పరిస్థితి ఏంటని అంటున్నారు. ఇలాంటి సంఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa