ట్రెండింగ్
Epaper    English    தமிழ்

140 కోట్ల మంది ఉన్నారు, గంపెడు మొక్కజొన్న పొత్తులైనా కొనరు: భారత్‌పై లుట్నిక్ ఫైర్

international |  Suryaa Desk  | Published : Mon, Sep 15, 2025, 09:14 PM

అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ మరోసారి భారత్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమెరికా నుంచి మొక్కజొన్నను దిగుమతి చేసుకోవడానికి భారత్ చూపిన విముఖత అలాగే విధించిన అధిక సుంకాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ తన సుంకాలను తగ్గించుకోకపోతే.. అమెరికాతో ఆరోగ్యకరమైన వాణిజ్య సంబంధాలను కొనసాగించడం కష్టం అవుతుందని లుట్నిక్ హెచ్చరించారు.


భారత దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారని లుట్నిక్ తెలిపారు. మరి వారు అమెరికా నుంచి కనీసం ఒక్క గంపెడు మొక్కజొన్ననైనా ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. భారత్ మనకు ప్రతిదీ అమ్ముతోందని.. కానీ మన మొక్కజొన్నను కొనడానికి మాత్రం వారు నిరాకరిస్తారని తెలిపారు. అంతేకాకుండా భారత్ ప్రతి దానిపై సుంకాలు విధిస్తోందని లుట్నిక్ పేర్కొన్నారు. ఇది కేవలం వారు మాత్రమే లాభం పొందే వాణిజ్య సంబంధం అని ఆయన అభివర్ణించారు. అమెరికా మార్కెట్‌కు భారత్ సులభంగా ప్రవేశాన్ని పొందుతున్నప్పటికీ.. అమెరికన్ వస్తువులపై మాత్రం ఆంక్షలు విధిస్తోందని ఆయన ఆరోపించారు.


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను పునరుద్ఘాటిస్తూ.. 'న్యాయమైన, పరస్పర వాణిజ్యం' ఉండాలని లుట్నిక్ అన్నారు. "మీ సుంకాలను తగ్గించుకోండి, మీరు మాతో ఎలా ప్రవర్తిస్తున్నారో అలాగే మేము కూడా మీతో ప్రవర్తిస్తాం" అని ఆయన భారత్‌కు పరోక్షంగా సూచించారు. లుట్నిక్ ప్రకారం.. భారత్ వస్తువులపై సుంకాలు విధించడం ద్వారా గతంలో జరిగిన అన్యాయాలను సరిచేయాలని అమెరికా కోరుకుంటోంది.


ట్రంప్ ప్రభుత్వం భారతీయ వస్తువులపై 50 శాతం వరకు సుంకాలు విధించింది. అంతేకాకుండా రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న చమురుపై 25 శాతం పన్నును కూడా విధించింది. ఇది అన్ని దేశాలపై విధించిన దానికంటే చాలా ఎక్కువ కాగా దీని గురించి లుట్నిక్ స్పందించారు. ఇది మా అధ్యక్షుడి నమూనా, మీరు దీన్ని అంగీకరించాలి లేకపోతే ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారు అయిన అమెరికాతో వ్యాపారం చేయడం మీకు కష్టం అవుతుందని లుట్నిక్ స్పష్టం చేశారు.


మరోవైపు భారత్ అమెరికా చర్యలను అధికారికంగా 'అన్యాయం, అసంబద్ధమైనవి' అని అభివర్ణించింది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును సమర్థించుకుంటూ.. ఇంధన సేకరణ దేశ జాతీయ ప్రయోజనాలు, మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని వాదించింది. ఈ అంశం వాణిజ్య వివాదానికి మరింత ఆజ్యం పోసింది. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు నిలిపివేస్తే వాణిజ్య ఒప్పందంపై పురోగతి సాధించవచ్చని లుట్నిక్ సూచించారు. సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇంధనం, సుంకాల సమస్యలను పరిష్కరించడమే చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి కీలకం అని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa