దేవాలయాలకు భక్తులు సమర్పించే కానుకలు, నిధులు కల్యాణ మండపాలు నిర్మించడానికి కాదని సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆలయ నిధులను ప్రభుత్వ నిధులుగా పరిగణించరాదని స్పష్టం చేస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.తమిళనాడులోని ఐదు ప్రముఖ దేవాలయాల నిధులను ఉపయోగించి, వివిధ ప్రాంతాల్లో కల్యాణ మండపాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టులోని మదురై ధర్మాసనం, ఆ ఉత్తర్వులను ఆగస్టు 19న రద్దు చేసింది. అద్దె ప్రాతిపదికన వివాహ వేడుకల కోసం మండపాలు నిర్మించడం అనేది "మతపరమైన కార్యక్రమాల" పరిధిలోకి రాదని తన తీర్పులో స్పష్టం చేసింది.ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. "దేవాలయ అభివృద్ధి కోసమో, ఇతర మంచి పనుల కోసమో భక్తులు విరాళాలు ఇస్తారు. అంతేగానీ, కల్యాణ మండపాలు కట్టడానికి కాదు" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. "ఒకవేళ ఆలయ ప్రాంగణంలో ఉన్న మండపంలో వివాహ వేడుక జరుగుతుంటే, అక్కడ అసభ్యకరమైన పాటలు పెడితే అది సరైన విధానం అవుతుందా" అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ నిధులను విద్య, వైద్య సంస్థల ఏర్పాటు వంటి సేవా కార్యక్రమాలకు వినియోగించాలని సూచించింది.పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనా కాదా అనేదే ఇక్కడ కీలకమని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు తీర్పుపై స్టే విధించడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు, ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని తెలిపింది. తదుపరి విచారణను నవంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa