2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాలలో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి రాగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితమైంది. ఈ ఓటమి తాలూకూ ప్రభావంతో చాలా మంది నేతలు పార్టీలు మారేశారు. కూటమిలోని ఏదో ఒక పార్టీలోకి చేరిపోయారు. మరికొందరు క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ఇంకొందరు వివిధ ఆరోపణలు, కేసులతో జైలుకు కూడా వెళ్లిన పరిస్థితి. అలాంటి నేతలలో ఒకరు గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ . అయితే వల్లభనేని వంశీకి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు, వార్తలు వైరల్ అవుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వల్లభనేని వంశీ.. అనతికాలంలోనే తన దూకుడుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2014లో టీడీపీ నుంచి గన్నవరం అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభంజనంలోనూ గన్నవరం నుంచి మరోసారి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. మరికొన్ని రోజులకు వల్లభనేని వంశీకి టీడీపీకి మధ్య విభేదాలు తలెత్తాయి. అనంతరం జరిగిన వివిధ రాజకీయ పరిణామాలలో వల్లభనేని వంశీ టీడీపీకి దూరం జరిగి.. వైసీపీకి చేరువయ్యారు. వైసీపీకి మద్దతుగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే 2024 ఎన్నికలకు కొన్ని రోజుల ముందు పార్టీ ఫిరాయింపుల కింద వల్లభనేని వంశీ ఎమ్మెల్యే పదవిపైనా వేటు పడింది. అయితే 2024 ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ తరుఫున పోటీ చేసిన వంశీ.. యార్లగడ్డ వెంకట్రావు చేతిలో ఓడిపోయారు.
ఎన్నికల ఫలితాల తర్వాత పొలిటికల్గా కాస్త ఇన్ యాక్టివ్గా ఉంటూ వచ్చిన వల్లభనేని వంశీపై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఉన్న వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల వ్యవహారంలో అరెస్ట్ కాగా.. ఆ తర్వాత పలు కేసులు చుట్టుముట్టడంతో 2025 ఫిబ్రవరి నుంచి జులై రెండో తేదీ వరకూ విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ. అయితే జులైలో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఇప్పుడు వల్లభనేని వంశీ మోహన్ శాశ్వతంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. విజయవాడ జైలు నుంచి విడుదలైన తర్వాత వల్లభనేని వంశీ రాజకీయాలలో యాక్టివ్గా లేరంటూ ప్రచారం జరుగుతోంది.
టీడీపీ కూటమి ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా వైసీపీ పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. మెడికల్ కాలేజీల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నిస్తోందంటూ వైసీపీ నేతలు రోడ్డెక్కుతున్నారు. అయితే వైసీపీ చేపడుతున్న ఏ కార్యక్రమంలోనూ వల్లభనేని వంశీ పెద్దగా కనిపించడం లేదు. దీంతో వల్లభనేని వంశీ రాజకీయాలకు దూరం అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై వల్లభనేని వంశీ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
మరోవైపు వల్లభనేని వంశీకి ఆరోగ్యం సరిగా లేదని.. అందుకే యాక్టివ్గా లేరంటూ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత రంగంలోకి దిగుతారని అంటున్నారు.గన్నవరంలో కమిటీల నియామకం కూడా చేపడుతున్నట్లు చెప్తున్నారు. అయితే వల్లభనేని వంశీ మోహన్ క్లారిటీ ఇచ్చేవరకూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఎండ్ కార్డ్ పడేలా లేదు..!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa