ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రష్యాలో 7.8, ఇండోనేషియాలో 6.1 తీవ్రతతో అతిభారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

international |  Suryaa Desk  | Published : Fri, Sep 19, 2025, 09:47 PM

రష్యాలోని సుదూర తూర్పు ప్రాంతంలో ఉన్న కమ్చట్కా ద్వీపకల్పం తీరంలో శుక్రవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా భవనాలు తీవ్రంగా ఊగిపోయాయి. ఒక్కసారిగా ఇళ్లన్నీ పడిపోయేలా ఊగడంతో.. ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అప్రమత్తమైన అధికారులు తక్షణమే సునామీ హెచ్చరికను జారీ చేశారు.


అమెరికా జియోలాజికల్ సర్వే నివేదిక ప్రకారం.. ఈ భూకంపం ప్రాంతీయ రాజధాని పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్కాస్కీకి తూర్పున 128 కిలోమీటర్ల దూరంలో.. కేవలం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఇది భూ ఉపరితలానికి దగ్గరగా ఉన్నందున ప్రకంపనలు తీవ్రంగా ఉన్నాయని నిపుణులు తెలిపారు. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టమూ సంభవించలేదు. రష్యా స్టేట్ జియోఫిజికల్ సర్వీస్ స్థానిక శాఖ ఈ భూకంపం తీవ్రతను 7.4గా అంచనా వేసింది. ప్రధాన భూకంపం తర్వాత కనీసం ఐదు సార్లు ప్రకంపనలు నమోదయ్యాయని వెల్లడించింది.


ఈ భూకంపంపై స్పందించిన కమ్చట్కా ప్రాంత గవర్నర్ వ్లాదిమిర్ సోలోడోవ్.. టెలిగ్రామ్లో ఒక పోస్ట్ చేశారు. "ఈరోజు ఉదయం మరోసారి కమ్చట్కా నివాసితుల నిలకడను పరీక్షించింది. ప్రస్తుతం ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు లేవు. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని కోరుతున్నాను" అని ఆయన తెలిపారు. ద్వీపకల్పం తూర్పు తీరానికి సునామీ హెచ్చరిక జారీ చేశామని.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నారు. యూఎస్‌ పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ కూడా సమీప తీరప్రాంతాలలో ప్రమాదకరమైన అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది.


గతేడాది జూలైలో ఇదే ప్రాంతం తీరంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించి.. సునామీకి దారితీసింది. ఆ సునామీ ధాటికి ఒక తీర గ్రామంలోని కొంత భాగం సముద్రంలో కొట్టుకుపోయింది. అలాగే గత 10 రోజుల్లోనే ఈ ప్రాంతంలో రెండుసార్లు భూకంపాలు వచ్చాయి. తీవ్రత కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురవుతూనే ఉన్నారు. అలాగే అధికార యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.


మరోవైపు ఇండోనేషియాలోని సెంట్రల్ పపువా ప్రావిన్స్‌లో శుక్రవారం తెల్లవారుజామున 6.1 తీవ్రతతో ఒక నిస్సారమైన భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే నివేదించింది. భూకంప కేంద్రం నబిరే పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఇండోనేషియాకు చెందిన బీఎంకేజీ ఏజెన్సీ మాత్రం ఈ భూకంపం తీవ్రతను 6.6గా పేర్కొంది. అలాగే ఇండోనేషియా పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్" పై ఉన్నందున తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయని పేర్కొంది. ఈ ప్రాంతంలో టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొనడం వల్ల అధిక భూకంప కార్యకలాపాలు జరుగుతాయని వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa