ఆంధ్రప్రదేశ్లో వర్షాలు ఊపందుకున్నాయి. ఒకవైపు ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది.విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ద్రోణి ప్రభావంతో శనివారం రాయలసీమ, దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన కుండపోత వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.మరోవైపు, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో 25న అల్పపీడనం ఏర్పడేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది. ఇది క్రమంగా బలపడి 27వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అనంతరం ఇది పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణించి ఒడిశా తీరాన్ని సమీపించవచ్చని భావిస్తున్నారు.ఈ అల్పపీడనం ప్రభావంతో 23 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు ఉత్తర కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పలు వాతావరణ మోడళ్లు సూచిస్తున్నాయి. ఇక శుక్రవారం సాయంత్రానికి నమోదైన వర్షపాత వివరాలను పరిశీలిస్తే, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో అత్యధికంగా 97.7 మిల్లీమీటర్లు, తిరుపతిలో 77.7 మి.మీ., చిత్తూరు జిల్లా కార్వేటినగర్లో 73.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa