ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీ20ల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా అర్షదీప్

sports |  Suryaa Desk  | Published : Sat, Sep 20, 2025, 09:12 AM

భారత యువ పేసర్ అర్షదీప్ సింగ్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్‌లో 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న‌ ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్షదీప్ ఈ చారిత్రక మైలురాయిని అందుకున్నాడు.మ్యాచ్ 20వ ఓవర్లో ఒమన్ బ్యాటర్ వినాయక్ శుక్లాను ఔట్ చేయడం ద్వారా అర్షదీప్ సింగ్ తన వందో వికెట్‌ను పూర్తి చేసుకున్నాడు. దీంతో పొట్టి ఫార్మాట్‌లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఇప్పటికే టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్న అర్షదీప్, ఇప్పుడు వంద వికెట్ల క్లబ్‌లో చేరి తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకున్నాడు.2022లో ఇంగ్లండ్‌పై సౌతాంప్టన్‌లో అరంగేట్రం చేసిన అర్షదీప్, తన తొలి మ్యాచ్‌లోనే 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అప్పటి నుంచి నిలకడగా రాణిస్తూ టీమిండియాలో కీలక బౌలర్‌గా మారాడు. ఈ ఫార్మాట్‌లో కేవలం 64 మ్యాచ్‌ల్లోనే 18.30 సగటుతో 100 వికెట్లు పడగొట్టడం విశేషం. అమెరికాపై 9 పరుగులకు 4 వికెట్లు తీయడం అతని కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన.కాగా, ఈ ఆసియా కప్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లకు అర్షదీప్ దూరంగా ఉన్నాడు. జట్టు యాజమాన్యం ప్రధాన పేసర్‌గా జస్‌ప్రీత్ బుమ్రాకు మాత్రమే అవకాశం ఇవ్వడంతో అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే, ఒమన్‌తో మ్యాచ్‌లో లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa