కోచింగ్ సెంటర్లకు వెళ్లడం కోసం విద్యార్థులు.. బడులకు రావడం మానేయడంపై రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. ఈ ధోరణిని అరికట్టడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ లకు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల సమయాల్లో విద్యార్థులు కోచింగ్ సెంటర్లకు వెళ్తున్నారా లేదా అని తనిఖీ చేయడానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని హైకోర్టు తెలిపింది.
జస్టిస్ దినేష్ మెహతా, జస్టిస్ అనూప్ కుమార్ ధండ్లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు తప్పనిసరి అని.. సరైన కారణం లేకుండా గైర్హాజరు అయితే విద్యార్థులు, పాఠశాలలు, సంబంధిత అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని బెంచ్ స్పష్టం చేసింది. ఈ సమస్యపై కఠినంగా వ్యవహరించడానికి, రాజస్థాన్లోని విద్యా బోర్డులు అన్నీ కలిసి ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది.
పాఠశాలలు, కోచింగ్ సెంటర్లలో ఆకస్మిక, యాదృచ్ఛిక తనిఖీలు నిర్వహించడానికి ఈ బృందాలు పనిచేస్తాయి. ఒకవేళ విద్యార్థులు పాఠశాల సమయాల్లో బడులకు గైర్హాజరై, అదే సమయంలో కోచింగ్ సెంటర్లలో కనిపిస్తే.. విద్యార్థులు, పాఠశాలలు, కోచింగ్ సెంటర్లతో సహా అందరిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా మధ్యలో చదువు మానేసి కోచింగ్ సెంటర్లకు వెళ్లే విద్యార్థులను బోర్డు పరీక్షలకు అనుమతించవద్దని కూడా న్యాయస్థానం వివరించింది. పాఠశాలలను విడిచి కోచింగ్ సెంటర్లకు వెళ్లడం వల్ల విద్యార్థుల విద్యాభ్యాసంపై ప్రతికూల ప్రభావం పడుతుందని బెంచ్ పేర్కొంది.
మూడు పాఠశాలల్లో తీవ్ర లోపాలను గుర్తించిన సీబీఎస్ఈ వాటిపై జరిమానాలు విధించింది. దీంతో ఆ పాఠశాలలు ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ.. హైకోర్టును ఆశ్రయించాయి. అయితే ఈ కేసును విచారిస్తున్నప్పుడు హైకోర్టు ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది. లోపాలను సరిదిద్దడానికి ఆ మూడు పాఠశాలలకు నాలుగు వారాల గడువు ఇచ్చిన న్యాయస్థానం.. ఏదైనా ప్రతికూల నిర్ణయంపై చట్టపరమైన పరిష్కారాలను కోరవచ్చని సూచించింది. ఈ సందర్భంగానే పాఠశాలలు, కోచింగ్ సెంటర్లలో తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సీబీఎస్ఈ, ఆర్బీఎస్ఈలను హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు విద్యా రంగంలో ఒక ముఖ్యమైన పరిణామంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇది విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా సంస్థలపై ఒక బలమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa