ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈసారి రావణ దహనం కాదు.. శూర్పణఖ దహనం..ఇండోర్ వినూత్న నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Sat, Sep 20, 2025, 08:12 PM

మరికొన్ని రోజుల్లో దసరా పండుగ రాబోతుంది. సాధారణంగా దసరా రోజున చాలా ప్రాంతాల్లో రావణ దహనం చేస్తారు. పది తలల రావణాసురుడి భారీ బొమ్మను ఏర్పాటు చేసి.. దాన్ని దహనం చేస్తారు. చెడుపై మంచి గెలుస్తుందనే దానికి చిహ్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య కాలంలో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాస్తవానికి దసరా సందర్భంగా దేశంలో ఎక్కడైనా సరే రావణ దహనం మాత్రమే నిర్వహిస్తారు. కానీ ఈసారి ఇందుకు విరుద్ధంగా శూర్పణఖను దహనం చేయబోతున్నారు. ఎక్కడ అంటే..


మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఈ సారి దసరా సందర్భంగా సరికొత్త కార్యక్రమం నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. అదే రావణ దహనానికి బదులుగా శూర్పణఖ దహనం. పౌరుష్ అనే పురుష హక్కుల సంస్థ రావణుడికి బదులుగా శూర్పణఖ దహనం చేయాలని నిర్ణయించింది. స్త్రీ దుష్టత్వానికి గుర్తుగా శూర్పణఖ బొమ్మను తగలబెట్టనున్నారు. రావణ దహనంలో రావణాసురుడికి పది తలలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కూడా శూర్పణఖ బొమ్మకు 11 తలలు ఏర్పాటు చేసి.. వాటి స్థానంలో ఈమధ్య కాలంలో ప్రియుడి కోసం పిల్లలను, భర్తలను చంపిన భార్యల ఫొటోలను వాటికి తగిలించబోతున్నారు. అక్టోబర్ 2న ఈ కార్యక్రమం జరుగుతుంది.


సాధారణంగా విజయదశమి రోజున చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా రావణ దహనం చేస్తారు. రాముడు రావణాసురుడిని ఓడించినందుకు రామ్‌లీల ప్రదర్శనలు నిర్వహిస్తారు. కానీ ఈసారి ఇండోర్‌లో మాత్రం విభిన్నంగా శూర్పణఖ దహనం చేయనున్నారు. దీని గురించి పౌరుష్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. దుష్టత్వానికి లింగ భేదం లేదు అని చెప్పడమే మా ఉద్దేశం. మహిళలు చేసే నేరాలను ఖండించడమే మా లక్ష్యం. అందుకే ఈ సంవత్సరం శూర్పణఖ దహనం చేయబోతున్నాం అని వారు తెలిపారు


సమాజంలో చాలామంది ఆధునిక శూర్పణఖలు ఉన్నారని.. వీరంతా అమాయకులైన మగవారికి నమ్మకద్రోహం చేస్తున్నారని పౌరుష్ సంస్థ ఆరోపిస్తోంది. అందుకే ఈ దసరాకు 'అధర్మ' అనే పేరుతో ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి కొందరు మద్దతు తెలుపుతుంటే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.


దసరా సందర్భంగా ఢిల్లీలోని ప్రసిద్ధ రామ్‌లీలా మైదానంలో నిర్వహించే రావణ దహన్ కార్యక్రమం ఎంతో ప్రసిద్ధి చెందింది. దసరా పండుగ అంటే మన దగ్గర అమ్మవారిని కొలిస్తే.. ఉత్తరాదిన రాముని లీలలను గానం చేస్తారు. అలానే చివరి రోజున ‘రావణ దహన్’ పేరుతో రావణుడి భారీ దిష్టిబొమ్మను దహనం చేస్తారు. దాదాపు 50 ఏళ్ల నుంచి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలను ప్రత్యక్షంగా చూడటం కోసం భక్తులతో పాటుగా సినీ, రాజకీయ, బిజినెస్ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా వస్తుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa