రాష్ట్రంలో ఉల్లి ధరల పతనంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కర్నూలు జిల్లా రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని టీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి తెలిపారు. రైతుల కన్నీళ్లు తుడిచేందుకు హెక్టారుకు రూ.50,000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.100 కోట్లకు పైగా భారం పడినా, రైతుల సంక్షేమానికే ప్రాధాన్యత ఇచ్చిందని కొనియాడారు.ఖరీఫ్ సీజన్లో కర్నూలు జిల్లా వ్యాప్తంగా 45,278 ఎకరాల్లో ఉల్లి సాగు చేసిన 24,218 మంది రైతులకు ఈ సాయం ద్వారా లబ్ధి చేకూరుతుందని తిక్కారెడ్డి వివరించారు. అంతేకాకుండా, ఉల్లి ధర కిలోకు రూ.12 కంటే తగ్గకుండా చూసేందుకు ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తోందని, తద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తోందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ రైతు పక్షపాతిగా నిలుస్తోందని అన్నారు.గత జగన్ ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని తిక్కారెడ్డి ఆరోపించారు. "జగన్ రెడ్డి హయాంలో ఉల్లి ధరలు కిలోకు రెండు, నాలుగు రూపాయలకు పడిపోయి రైతులు రోడ్డున పడ్డారు. క్వింటా ధర రూ.517కు పడిపోవడంతో కూలీ ఖర్చులు కూడా రాని దయనీయ పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఎన్నికల ముందు రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి, రైతులను మోసం చేశారు" అని ఆయన విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016, 2018 సంవత్సరాల్లో మార్కెట్ జోక్యం చేసుకుని లక్షల క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నామని గుర్తుచేశారు.ప్రస్తుత ప్రభుత్వం కేవలం ఉల్లి రైతుల్నే కాకుండా, అన్ని రకాల రైతులను ఆదుకుంటోందని తిక్కారెడ్డి తెలిపారు. ఏడాదికి రూ.20,000 పెట్టుబడి సాయం హామీలో భాగంగా ఇప్పటికే తొలి విడతగా రూ.7,000 జమ చేసిందని, మామిడి, పొగాకు, కోకో, కాఫీ రైతులకు సైతం అండగా నిలుస్తోందని చెప్పారు. రాయలసీమ రైతుల ప్రయోజనాల కోసం హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు ద్వారా కేవలం 100 రోజుల్లో 1,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి చంద్రబాబు చారిత్రక ఘనత సాధించారని ప్రశంసించారు. టమాటా రైతుల కోసం పత్తికొండలో త్వరలోనే టమాటా జ్యూస్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నారా లోకేశ్ కృషి చేస్తున్నారని, కర్నూలును ఇండస్ట్రీ హబ్గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తిక్కారెడ్డి పేర్కొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa