ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాల ఘనతను మోదీ సొంతం చేసుకుంటున్నారని విమర్శ

national |  Suryaa Desk  | Published : Mon, Sep 22, 2025, 06:14 AM

గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్లో కీలక సంస్కరణలు చేపడుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ప్రకటించిన మార్పులు ఏమాత్రం సరిపోవని, రాజ్యాంగబద్ధమైన జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల ఘనతను ప్రధాని ఒక్కరే దక్కించుకోవాలని చూస్తున్నారని ఆరోపించింది.ఆదివారం సాయంత్రం ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించిన అనంతరం కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ విభాగం జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. "రాజ్యాంగబద్ధ సంస్థ అయిన జీఎస్టీ కౌన్సిల్ చేసిన సవరణలకు తానే పూర్తి యజమాని అన్నట్లుగా ప్రధాని ఈ రోజు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు," అని ఆయన పేర్కొన్నారు.జీఎస్టీ అంటే 'వృద్ధిని అణిచివేసే పన్ను' అని తాము ఎప్పటినుంచో చెబుతున్నామని జైరాం రమేశ్ గుర్తుచేశారు. అధిక పన్ను శ్లాబులు, నిత్యావసరాలపై భారీ రేట్లు, పన్ను ఎగవేతలు, సంక్లిష్టమైన నిబంధనలు వంటి సమస్యలతో జీఎస్టీ వ్యవస్థ నిండిపోయిందని ఆయన విమర్శించారు. 2017 జులై నుంచే తాము 'జీఎస్టీ 2.0' తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నామని, ఈ విషయాన్ని 2024 ఎన్నికల మేనిఫెస్టో 'న్యాయ్ పత్ర'లో కూడా స్పష్టంగా చెప్పామని తెలిపారు.ప్రస్తుత సంస్కరణల్లోనూ అనేక లోపాలున్నాయని జైరాం రమేశ్ ఎత్తిచూపారు. దేశ ఉపాధికి వెన్నెముక అయిన ఎంఎస్ఎంఈలు ఇప్పటికీ విధానపరమైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టెక్స్‌టైల్స్, పర్యాటకం, హస్తకళలు, వ్యవసాయ ఇన్‌పుట్స్ వంటి కీలక రంగాల్లోని సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదన్నారు. విద్యుత్, పెట్రోలియం, మద్యం, రియల్ ఎస్టేట్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, రాష్ట్రాలకు జీఎస్టీ పరిహార కాలాన్ని మరో ఐదేళ్లు పొడిగించడంలో కేంద్రం విఫలమైందని, ఇది సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమనిదుయ్యబట్టారు.


 


.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa