ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి .. అసెంబ్లీలో మంత్రి ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 22, 2025, 04:49 PM

ఏపీలోని పేదలకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ శుభవార్త చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సమావేశాల్లో భాగంగా సోమవారం జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో.. పలువురు ఎమ్మెల్యేలు ఏపీలో టిడ్కో ఇళ్ల ప‌రిస్థితిపై ప్రశ్నలు అడిగారు. వీటికి సమాధానం ఇచ్చిన మంత్రి నారాయ‌ణ‌.. 2026 జూన్ నెలాఖ‌రులోపు రాష్ట్రంలోని 2,61,640 టిడ్కో ఇళ్లను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఆ దిశగా ముందుకెళ్తున్నట్లు వివరించారు. అలాగే ఎక్కడైనా టిడ్కో ఇళ్లు పూర్తి అయితే.. ప్రతి శనివారం వాటిని లబ్ధిదారులకు అందించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ మేరకు మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.


మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో ఇళ్ల నిర్మాణంతో పాటుగా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు, మౌలిక వసతుల కల్పన కోసం రూ.7280 కోట్లు అవసరం అవుతాయని మంత్రి నారాయణ వివరించారు. ఈ నిధులను వివిధ బ్యాంకుల నుంచి రుణాల రూపంలో, హడ్కో ద్వారా సమీకరిస్తున్నట్లు తెలిపారు. టిడ్కో ఇళ్ల విషయానికి వస్తే 2014-19 మధ్యకాలంలో కేంద్రం ఏపీకి 7,01,481 టిడ్కో ఇళ్లు కేటాయించింది. వీటిలో సుమారుగా ఐదు లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు లభించాయి. అనంతరం ఈ ఇళ్ల నిర్మాణానికి టెండర్లు కూడా పిలిచారు. అయితే వైసీపీ ప్రభుత్వం వీటిని 2,61,640 కు త‌గ్గించిందని మంత్రి నారాయణ ఆరోపించారు. ఆ ఇళ్ల నిర్మా్ణాలను కూడా పూర్తి చేయలేదని నారాయణ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్ల మీద ప్రత్యేక దృష్టి సారించి.. త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటోందని వివరించారు.


మరోవైపు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రాథమిక పాఠశాలల్ని, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనంపై ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు మంత్రి నారా లోకేష్‌ను ప్రశ్న అడిగారు. వైసీపీ హయాంలో చాలా ప్రాథమిక పాఠశాలలను.. అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో విలీనం చేశారని.. దీని వలన విద్యార్థులుు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనిని పరిష్కరించాలని మంత్రి లోకేష్‌ను కోరారు. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన లోకేష్.. ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు అనేది తమ లక్ష్యమని అన్నారు.


విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల నియామకం, గదుల నిర్మాణం జరుగుతోందని వివరించారు. పాఠశాల భవన నిర్మాణాల కోసం దాతల సహకారం కోరుతున్నామని.. సహకరించిన వారి పేర్లను భవనాలపై ఉండేలా చూస్తామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ నో అడ్మిషన్ బోర్డులు ఉండాలనేదే తమ లక్ష్యమని నారా లోకేష్ స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa