ఆసియాకప్ 2025లో టీమిండియా వరుసగా నాలుగు మ్యాచ్లలో విజయం సాధించింది. ఇందులో రెండు సార్లు పాకిస్థాన్ను ఓడించింది. అయితే ఈ టోర్నీ సూపర్-4లో భారత్ మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అందులో శ్రీలంక, బంగ్లాదేశ్తో సూర్యకుమార్ సారథ్యంలోని టీమ్ తలపడనుంది. ఆ తర్వాత సూపర్-4లో టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్ చేరనున్నాయి. ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే.. టీమిండియా ఫైనల్ చేరడం పెద్ద కష్టమేమీ కాదు.
ఇక ఫైనల్ బెర్తు కోసం ప్రస్తుతం నాలుగు గట్ల మధ్య పోటీ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. భారత్, పాకిస్థాన్ మధ్య ఆసియాకప్ 2025లో మరో మ్యాచ్ ఉంటుందా? దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ జరిగేందుకు ఎంత వరకు అవకాశం ఉంది? సాధ్యాసాధ్యాలేంటో ఇప్పుడు చూద్దాం..
భారత్, పాక్ మళ్లీ మ్యాచ్ ఆడాలంటే..
ప్రస్తుతం సూపర్-4 పాయింట్స్ టేబుల్లో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. మిగతా రెండు మ్యాచ్లలోనూ పెద్దగా ప్రతిఘటన రాకపోవచ్చు. దీంతో భారత్ ఫైనల్ చేరడం ఖాయమే. ఇక పాకిస్థాన్ కూడా ఫైనల్ చేరితే.. భారత్తో తలపడే అవకాశం ఉంటుంది. అది జరగాలంటే పాకిస్థాన్ అద్బుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. తన తదుపరి మ్యాచ్లలో ఆ జట్టు.. శ్రీలంక, బంగ్లాదేశ్తో ఆడుతుంది. ఈ రెండు మ్యాచ్లలో గెలిస్తేనే పాక్.. ఫైనల్ చేరేందుకు అవకాశం ఉంటుంది. ఒక్క దాంట్లో ఓడినా.. టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే.
ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగి.. భారత్, పాకిస్థాన్ ఫైనల్ చేరితే ఆదివారం (సెప్టెంబర్ 28) జరిగే టైటిల్ ఫైట్లో ఈ రెండు జట్లు తలపడతాయి. కాగా ఇప్పటివరకు 16 సార్లు ఆసియాకప్ జరిగింది. అందులో 8 సార్లు టీమిండియా విజేతగా నిలిచింది. పాక్ రెండు సార్లు టైటిల్ సాధించింది. కానీ ఈ రెండు జట్ల మధ్య ఒక్కసారి కూడా ఆసియాకప్ ఫైనల్ జరగలేదు. ఈ పరిస్థితుల్లో తొలిసారి భారత్, పాక్ జట్లు ఆసియాకప్ ఫైనల్లో తలపడతాయా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa