ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 80వ సెషన్ సందర్భంగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. న్యూయార్క్లో అరబ్ ఇస్లామిక్ దేశాల నేతలకు ట్రంప్, ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ సంయుక్తంగా ఇచ్చిన విందులో ఈ సమావేశం జరిగింది. అయితే షరీఫ్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ సంభాషణ కేవలం 36 సెకన్ల పాటు మాత్రమే కొనసాగిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తే తెలుస్తోంది.
ఈ సమావేశం ముగిసిన తర్వాత పాకిస్థాన్ ప్రధాని ట్రంప్తో "అనధికారిక సంభాషణ"లో పాల్గొన్నారని తెలుస్తోంది. పాకిస్థాన్ ప్రతినిధి బృందానికి షరీఫ్ నేతృత్వం వహించారు. ఆయన వెంట డిప్యూటీ, విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఇషాక్ దార్, ఇతర మంత్రులు, సీనియర్ అధికారులు ఉన్నారు. గత వారం పాకిస్థాన్ మీడియా వారి ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ కూడా ఈ సమావేశంలో షరీఫ్తో పాటు వెళ్తారని నివేదించినప్పటికీ.. మునీర్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఇది పాకిస్థాన్ ప్రభుత్వంలో భేదాభిప్రాయాలకు దారి తీస్తుందనే చర్చకు తెరతీసింది.
గతంలో పాక్-అమెరికా మధ్య బంధం సరిగ్గా లేకపోయినప్పటికీ.. ఈమధ్య కాలంలో ఈ రెండు దేశాల మధ్య భాగస్వామ్యం పెరుగుతోంది. అందులో భాగంగానే ఈ ఏడాది జూన్ నెలలో ట్రంప్ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ను వైట్ హౌస్కు ఆహ్వానించి వాణిజ్యం, ఆర్థిక అభివృద్ధి, క్రిప్టో కరెన్సీపై చర్చించారు. ఆ తరువాత జూలైలో.. ట్రంప్ పరిపాలన విభాగం పాకిస్థాన్తో ఒక వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించింది. అంతేకాకుండా పాక్లోని "భారీ చమురు నిల్వలను" అభివృద్ధి చేయడానికి వాషింగ్టన్ సహాయం చేస్తుందని కూడా ప్రకటించింది.
దీని తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఆగస్టులో మరోసారి వాషింగ్టన్కు వెళ్లారు. ఇది మాత్రమే కాకుండా ఇటీవలే పాకిస్థాన్ తమ కీలక ఖనిజాల రంగానికి అమెరికా నుంచి 500 మిలియన్ డాలర్ల పెట్టుబడిని కూడా పొందింది. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య సంబంధాలలో గణనీయమైన మార్పును సూచిస్తున్నాయి. కానీ తాజాగా ఇరుదేశాల నేతలు కేవలం 36 సెకన్లు మాత్రమే కలిసిన వీడియో వైరల్ కావడంతో అంతా షాక్ అవుతున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa