ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భారత్ మా వైపే ఉంది': ఇండియాపై ట్రంప్ ఆరోపణలను తిప్పికొట్టిన జెలెన్‌స్కీ

international |  Suryaa Desk  | Published : Wed, Sep 24, 2025, 09:58 PM

ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ నిధులు సమకూరుస్తోందని చాలా కాలంగా ఆరోపిస్తూ వస్తుండగా.. తాజాగా దానిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. భారత్‌ను సమర్థిస్తూ.. ఇండియా తమవైపే ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా భారత్ తమకు ముఖ్యమైన భాగస్వామి అని, ఐరోపా దేశాలు భారత్‌తో సంబంధాలను మరింత పెంచుకోవాలని ఆయన సూచించారు.


అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఐక్యరాజ్యసమితి 80వ సమావేశంలో మాట్లాడుతూ.. చైనా-ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ సహకరిస్తోందని అన్నారు. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఆ దేశానికి నిధులు చేకూరుస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా NATO దేశాలు కూడా రష్యా శక్తిని ఎమాత్రం తగ్గించలేదని ట్రంప్ పేర్కొన్నారు. ఒక్కసారి ఆలోచించమంటూనే.. భారత్ తమకు వ్యతిరేకంగా యుద్ధానికి నిధులు ఇస్తోందని తెలిపారు. అంతటితో ఆగకుండా NATO మిత్రదేశాలు ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నారని చెప్పారు. రష్యా శాంతి చర్చలకు రాకపోతే.. మాస్కోతో వ్యాపారం చేస్తున్న దేశాలపై కొత్త పన్నులు విధిస్తామని ట్రంప్ మరోసారి హెచ్చరించారు.


 కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఇండియా మా వైపే ఉందని తెలిపారు. ఇంధన రంగంలో కొన్నికొన్ని సమస్యలు ఉన్నప్పటికీ.. వాటిని పరిష్కరించుకోవచ్చని తెలిపారు. అంతేకాకుండా ఐరోపా ఇండియాతో బలమైన సంబంధాలు పెట్టుకోవాలని సూచించారు. మనం భారత్ నుంచి వైదొలగకూడదని అన్నారు. ముఖ్యంగా ఇండియాను ఒంటరి చేయడం సరికాదని స్పష్టం చేశారు.


మరోవైపు భారత్ తన చమురు కొనుగోళ్లను సమర్థించుకుంది. దేశీయ ఇంధన భద్రత, ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా కొనాల్సి వస్తోందని పునరుద్ఘాటించింది. ఐరోపా దేశాలు కూడా ఇలాంటి లావాదేవీలు చేస్తున్నాయని, భారత్‌ను మాత్రమే వేరు చేయడం సరికాదని భారత అధికారులు అంటున్నారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కాస్త మెత్తగా మాట్లాడారు. సమస్యలను పరిష్కరించుకోవాలని వాషింగ్టన్ ఆశిస్తోందని తెలిపారు. భారత్ దిగుమతి చేసుకునే రష్యా చమురుపై విధించిన పన్నుల గురించి చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. సమస్యలన్నింటినీ పరిష్కరించుకోగలమని తాము అనుకుంటున్నామన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa