ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తుంది,': ఐరాసలో భారత్ ఘాటు వ్యాఖ్యలు

international |  Suryaa Desk  | Published : Wed, Sep 24, 2025, 09:55 PM

పాకిస్థాన్‌పై భారతదేశం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రాంతంలో పాకిస్థాన్ తన సొంత ప్రజలపైనే బాంబులు వేస్తోందని భారత్ ఆరోపించింది. అదే సమయంలో అంతర్జాతీయ వేదికను దుర్వినియోగం చేస్తూ.. భారత దేశంపై నిరాధారమైన, రెచ్చగొట్టే ఆరోపణలు చేస్తోందని ఎండగట్టింది.


జెనీవాలోని ఐరాసలో భారత శాశ్వత మిషన్ కౌన్సెలర్ అయిన త్యాగి మాట్లాడుతూ.. "మానవ హక్కుల విధానానికి విరుద్ధంగా వ్యవహరించే ఒక ప్రతినిధి బృందం భారతదేశంపై నిరాధారమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఈ వేదికను దుర్వినియోగం చేస్తూనే ఉంది" అని పాకిస్థాన్‌ను ఉద్దేశించి అన్నారు. మా భూభాగాన్ని ఆక్రమించాలని కోరుకునే బదులు, తమ అక్రమ ఆధీనంలో ఉన్న భారత భూభాగాన్ని ఖాళీ చేసి, తమ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే లైఫ్ సపోర్ట్‌లో ఉందన్నారు. సైనిక ఆధిపత్యంతో ఆ దేశ రాజకీయ వ్యవస్థ పూర్తిగా అణిచివేయడిందన్నారు. దోపిడీతో మకిలిపట్టిన మానవ హక్కుల రికార్డును సరిదిద్దుకోవాలని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.


ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడం, ఐరాస నిషేధించిన ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, సొంత ప్రజలపై బాంబులు వేయడం వంటి వాటి నుంచి వారికి సమయం దొరికితేనే ఏమైనా చేయగలరని త్యాగి అన్నారు. త్యాగి ఇలా అనడానికి ఓ పెద్ద కారణమే ఉంది. ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని తిరాహ్ లోయలోని మత్రే దారా గ్రామంలో తన సొంత ప్రజలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో మహిళలు, పిల్లలతో సహా కనీసం 30 మంది పౌరులు మరణించారు. చైనాలో తయారైన జె-17 ఫైటర్ జెట్లను ఉపయోగించి, చైనాలోనే తయారు చేసిన ఎల్‌ఎస్-6 బాంబులను రాత్రి సుమారు 2 గంటల సమయంలో పాకిస్థానీ వైమానిక దళం ప్రజలపై వేసింది.


ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతం పాకిస్థాన్‌లోని ఓ మారుమూల పర్వత ప్రాంతం. ఇక్కడ అనేక ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో తమ నియంత్రణను ఏర్పాటు చేయడానికి పాకిస్థాన్ సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఈ ప్రక్రియలోనే అమాయక ప్రజలు బలవుతున్నారు. ఈక్రమంలోనే అక్కడి ప్రజలంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు సైనికులు, అటు ఉగ్రవాదుల దాడుల వల్ల తమ ప్రాణాలు పోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా తమ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించాలంటూ కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa