బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియ కూటమితో కలిసి వెళ్లేందుకు ఆల్ ఇండియా మజ్లీస్ ఇత్తేదుహుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) సిద్ధంగా ఉన్నట్టు ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ధ్రువీకరించారు. ఈ విషయంపై ఆర్జేడీని సంప్రదించినట్టు తెలిపారు. బీజేపీ-జేడీయూలపై పోరాడాలా? వద్దా? అనే బంతి వారి కోర్టులోనే ఉందని అన్నారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బిహార్ ఎన్నికల్లో ఎంఐఎం పొత్తుల గురించి మాత్రమే కాకుండా.. గార్బా కార్యక్రమాలను ముస్లింలు బహిష్కరణ, ‘ఐ లవ్ మహమ్మద్’పోస్టర్లు, లడఖ్ ఆందోళనలు గురించి మాట్లాడారాు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల గురించి అడిగిన ప్రశ్నకు అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. చర్చలు మొదటి దశలోనే ఉన్నాయని చెప్పారు. కానీ, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు లేఖ రాసినట్టు నిర్దారించారు. అయితే, కాంగ్రెస్తో ఇంకా సంప్రదింపులు జరపలేదని అన్నారు. ‘మా తలుపులు ఇంకా మూసుకోలేదు.. కానీ, ఎవరికోసమో వేచి చూడలేం’ అని తెలిపారు. గత బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్వాంచల్లో తమ పార్టీ ఐదు సీట్లు గెలిచిందని అన్నారు. పూర్వాంచల్లో ఆర్జేడీ పోటీని స్వాగతించారు.
గత వారం ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ తనకు లేదా తన తండ్రి లాలూ యాదవ్కు ఒవైసీ నుంచి ఎటువంటి ప్రతిపాదన రాలేదని వెల్లడించిన నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన పార్టీ బీహార్ చీఫ్ అఖ్తరుల్ ఇమాన్ వారిద్దరికీ లేఖ రాశారని ఒవైసీ చెప్పారు.
‘ఐ లవ్ మహమ్మద్’ పోస్టర్ల వివాదం.. దీనికి కౌంటర్గా వారణాసిలో ఆధ్యాత్మిక నేతలు చేపట్టిన ‘ఐ లవ్ మహాదేవ్’ ప్రచారంపై కూడా స్పందించారు. ‘‘ఎవరో ‘ఐ లవ్ యూ’ అంటే అందులో తప్పేమి ఉంది? ‘లవ్’ అని రాయడంలో ఏ సమస్య ఉంది? దీని ద్వారా మీరు ప్రపంచంలోని ముస్లిం దేశాలకు ఎలాంటి సందేశం పంపాలనుకుంటున్నారు? ‘ఐ లవ్ మహాదేవ్’ అంటే ఏమి సమస్య? అది వాళ్ల విశ్వాసం. అలాగే చేయాలి. కానీ దీన్ని ముస్లింలను సామాజికంగా బహిష్కరించేందుకు వాడుతున్నారు’’ అని ఓవైసీ అన్నారు.
ఉత్తర్ ప్రదేశ్లోని కాన్పూర్లోని ఇటీవల మిలాద్ ఉన్ నబీ ర్యాలీలో ‘ఐ లవ్ మహమ్మద్’ ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడంతో స్థానిక హిందువులు అభ్యంతరం వ్యక్తం చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. సోషల్ మీడియాలో ILoveMuhammad హ్యష్టాగ్తో వైరల్ అయ్యింది.
గర్బా కార్యక్రమాల్లో ముస్లింలకు ప్రవేశం నిరాకరించడం కూడా ఒక రకమైన సామాజిక బహిష్కరనేనని, నవరాత్రి వేడుకల్లో హిందువులు మాత్రమే పాల్గొనాలని విశ్వ హిందూ పరిషత్ ఆదేశించడాన్ని ఒవైసీ ఎత్తిచూపారు. బీజేపీ ‘చొరబాటుదారుల’ విమర్శలపై ఒవైసీ ఎదురుదాడి చేశారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులను ఆర్జేడీ, కాంగ్రెస్ ఆదరిస్తున్నాయని బీజేపీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. గత 11 ఏళ్లుగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉందని, సీమాంచల్లో ‘చొరబాటుదారులు’ ఉంటే అది వారి బాధ్యత అని కౌంటర్ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa